క్లిష్టంగా ఉన్న బెంగళూరు పిచ్పై టీమిండియా యువఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (92) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనూహ్యమైన టర్న్, బౌన్స్ చూపిస్తున్ బెంగళూరు పిచ్పై భారత ప్రధాన బ్యాటర్లెవరూ నిలబడలేకపోయారు. మయాంక్ అగర్వాల్ (4), రోహిత్ శర్మ (15), హనుమ విహారి (31), విరాట్ కోహ్లీ (23) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
ముఖ్యంగా కోహ్లీ అవుటైన బంతి అతన్నే కాదు మ్యాచ్ చూస్తున్న అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. షార్ట్ పిచ్లో డిసిల్వ వేసిన బంతి అస్సలు బౌన్స్ అవ్వకుండా 12 డిగ్రీల టర్న్ తీసుకొని కోహ్లీ కాలికి తగిలింది. దాన్ని తప్పించుకోలేకపోయిన కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొదటి మ్యాచ్ హీరోలు రిషభ్ పంత్ (39), రవీంద్ర జడేజా (4), రవిచంద్రన్ అశ్విన్ (13) కూడా తడబడ్డారు.
అక్షర్ పటేల్ (9), షమీ (5) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇంతమంది క్రీజులో నిలబడేందుకు కష్టపడుతున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే అద్భుతమైన పట్టుదల కనబరిచాడు. పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. చివర్లో సెంచరీ చేయాలనే తొందర్లో 60వ ఓవర్ తొలి బంతికే ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ జయవిక్రమ తెలివిగా వేసిన బంతి బాగా టర్న్ అయి అతన్ని దాటేసింది. దాన్ని అందుకున్న కీపర్ డిక్కవెల్ల వికెట్లను పడగొట్టాడు. దీంతో అయ్యర్ సెంచరీ చేయకుండానే అవుటైపోయాడు. అలాగే భారత ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అయ్యర్ పోరాటంతో భారత జట్టు 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టర్న్, బౌన్స్ అద్భుతంగా ఉన్న బెంగళూరు పిచ్పై భారత స్పిన్నర్లు ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.