టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బెంగళూరు టెస్టులో తొలి సారి స్వదేశంలో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లతో చక్కని సహకారం అందించారు. సిరాజ్ స్థానంలో అవకాశం దక్కించుకున్న అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు.
దీంతో శ్రీలంక బ్యాటర్లు వణికిపోయారు. టీమిండియా బౌలింగ్ దళాన్ని ఎదుర్కోలేక చతికిలపడ్డారు. కుశాల్ మెండిస్ (2), దిముత్ కరుణరత్నే (4), లాహిరు తిరిమానే (8), ధనంజయ డిసిల్వా (10), చరిత్ ఆసలంక (5) ఎవరూ తొలి రోజు ఆటలో ఆకట్టుకోలేదు. ఏంజెలో మాథ్యూస్ (43) ఒక్కడే కొంత పోరాట పటిమ చూపాడు.
రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే డిక్కవెల్ల (21)ను పెవిలియన్ చేర్చిన బుమ్రా.. కాసేపటికే ఎంబుల్డెనియా (1)ను కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ తన మాయ చేసి సురంగ లక్మల్ (5), విశ్వ ఫెర్నాండో (8)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో శ్రీలంక జట్టు 109 పరుగులకే కుప్పకూలింది.