వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన అనుభవాన్ని నిరూపించుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో వికెట్ కూల్చాడు. భారత జట్టు 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో లంకేయులు బ్యాటింగ్కు వచ్చారు. వారిని తొలి దెబ్బ కొట్టిన అశ్విన్.. తిరుమనే (17)ను పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత జడేజా, బుమ్రా కూడా చెరో వికెట్ తీశారు. ఈ క్రమంలో 39వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన అశ్విన్ మరోసారి లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఫుల్ లెంగ్త్లో అశ్విన్ వేసిన బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించిన ధనంజయ డిసిల్వ (1) మిస్ అయ్యాడు. దాంతో బంతి ప్యాడ్లను తాకింది.
టీమిండియా మొత్తం అప్పీలు చేసిన వెంటనే అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. బంతి ఫుల్ లెంగ్త్ కావడంతో టర్న్ అయినా వికెట్లను దాటి పోదని తెలిసిన ధనంజయ రివ్యూ కోరకుండానే మైదానం వీడాడు. దీంతో లంక జట్టు 40 ఓవర్లకు 108/4 స్కోరుతో నిలిచింది.