దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో సఫారీలు బోణి కొట్టారు. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ను ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే చేధించారు. ఒకానొక దశలో పరుగుల వేటలో సఫారీలు చతికిలపడుతున్నారని అనుకుంటున్న సమయంలో డేవిడ్ మిల్లర్, డస్సెన్ మ్యాచ్ను మలుపుతిప్పారు. అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా.. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. రుతురాజ్ గైక్వాడ్ (23) పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (36), ఇషాన్ కిషన్ (76) ఇద్దరు ధాటిగా ఆడారు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక ఇషాన్ కిషన్ ఔటయిన తర్వాత టీమిండియా పరుగులు తీయడంలో నెమ్మదించింది. పంత్ (29) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 211 పరుగులకే పరిమితమైంది.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. పరుగులు తీయడంలో ఓపెనర్లు క్వింటన్ డికాక్ (22), బావుమా (10) విఫలమయ్యారు. ఆ తర్వాత ప్రెటొరియస్ (29) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఒకానొక దశలో సఫారీలు పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డారు. అలాంటి సమయంలో బ్యాటింగ్కు దిగిన మిల్లర్ (75), డస్సెన్ (64) మ్యాచ్ను మలుపు తిప్పారు. చివరి ఐదు ఓవర్లు చెలరేగి ఆడారు. ఫలితంగా టీమిండియాపై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.