ప్రస్తుతం టీమిండియా.. సౌతాఫ్రికాలో పర్యటనలో ఉంది. ఇక్కడ మొత్తం మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు వెళ్లింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో జరిగే టెస్టుల్లో భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు కచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్లో జట్టు సాధించిన కీలకమైన విజయాల్లో శార్దూల్ పాత్ర ఉందని బంగర్ అన్నాడు.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో తలపడే జట్టులో శార్దూల్కు కచ్చితంగా స్థానం దక్కుతుందని చెప్పాడు. ‘ఓవర్సీస్ పరిస్థితిల్లో బౌలింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ అవసరం చాలా ఉంటుంది. శార్దూల్ ఈ కేటగిరీ ఆటగాడే’ అని బంగర్ వివరించాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ప్రకటించిన 18 మంది బృందంలో శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.