IND vs SA: వరల్డ్ కప్లో ఇదివరకే సెమీస్ బెర్త్లు ఖాయం చేసుకున్న రెండు అగ్రశ్రేణి జట్లు భారత్, సౌతాఫ్రికాల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైనా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 24 బంతుల్లోనే ఆరు బౌండరీలు, రెండు భారీ సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా పెవిలియన్ చేరారు. గిల్ 24 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 23 పరుగులు చేశాడు.
ఎంగిడి వేసిన తొలి ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించి రోహిత్ ఖాతా తెరిచాడు. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో గిల్ రెండు బౌండరీలు కొట్టాడు. ఎంగిడి వేసిన మూడో ఓవర్లో రోహిత్ రెండు బౌండరీలు బాదగా గిల్ కూడా ఫోర్ కొట్టడంతో భారత స్కోరు వేగం రాకెట్ వేగాన్ని తలపించింది. జాన్సెన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన హిట్మ్యాన్.. ఎంగిడి వేసిన ఐదో ఓవర్లో ఒక ఫోర్ రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో భారత స్కోరు ఐదు ఓవర్లకే 60 పరుగులు దాటింది. అయితే రబాడా వేసిన ఆరో ఓవర్లో ఐదో బంతికి రోహిత్.. కవర్స్లో బవుమా చేతికి చిక్కాడు.
రోహిత్ నిష్క్రమించినా బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ, గిల్లు సఫారీ బౌలర్లపై అదే దాడిని కొనసాగించారు. జాన్సెన్ వేసిన తొమ్మిదో ఓవర్లో గిల్, కోహ్లీలు తలా ఓ బౌండరీ బాదారు. రబాడా వేసిన పదో ఓవర్లో కోహ్లీ రెండు బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో విరుచుకుపడటంతో పది ఓవర్లకే భారత్ స్కోరు 91-1గా నమోదైంది. పేసర్లను భారత బ్యాటర్లు ధాటిగా ఎదుర్కుంటుండటంతో బవుమా.. స్పిన్నర్ కేశవ్ మహారాజ్కు బంతినిచ్చాడు. మహారాజ్ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గిల్ నిష్క్రమణతో భారత స్కోరువేగం నెమ్మదించింది. పది ఓవర్లకే 91 పరుగులు చేసిన టీమిండియా.. తర్వాత ఐదు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ భారత స్కోరు 121-2 గా ఉంది. శ్రేయాస్ అయ్యర్ (11 నాటౌట్) తో పాటు విరాట్ కోహ్లీ (36 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.