టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు కెప్టెన్ వన్డేలకు, వన్డే కెప్టెన్ టెస్టులకు దూరమవుతున్నారని వార్తలు రావడంపై పలువురు మాజీలు స్పందించారు. భారత జట్టుకు టెస్టుల్లో కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా.. వన్డే సారధిగా ఇటీవలే రోహిత్ పేరును బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్కు వెళ్లాల్సిన భారత జట్టు ముంబైలో బయో బబుల్లో ప్రవేశించింది.
ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ రోహిత్ గాయపడ్డాడు. దీంతో అతను టెస్టు సిరీస్కు దూరమవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇదే క్రమంలో కుమార్తె తొలి పుట్టినరోజు జరుపుకోవడం కోసం కోహ్లీ సెలవు కోరాడని, ఈ కారణంగా అతను సౌతాఫ్రికాతో వన్డేలకు దూరమవుతున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ మాట్లాడాడు.
ఈ ఇద్దరు కెప్టెన్లూ కలిసి ఆడకపోతే భారత జట్టు చాలా నష్టపోతుందని ఆజాద్ అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్, కోహ్లీ ఇద్దరూ కలిసి ఆడకపోతే జట్టు చాలా కష్టాలు పడుతుంది. ఆ తర్వాత వాళ్లకు కూడా కష్టాలు తప్పవు. ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడు రావడం సహజం. ఎవరూ ఇక్కడ శాశ్వతం కాదు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి చాలా మంది గొప్పవాళ్లు వచ్చారు, వెళ్లారు’ అని ఆయన చెప్పాడు.