ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ టీ20 సిరీస్లో అత్యంత పేలవ బ్యాటింగ్తో అందరినీ నిరుత్సాహపరిచిన ఆటగాడు రిషభ్ పంత్. వైడ్ వెళ్తున్న బంతులను అనవసరంగా ఆడి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటు అయిపోయింది. ఒక పక్క వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తుంటే.. పంత్ ఇలా పేలవంగా ఆడటం అభిమానులకు మింగుడు పడటం లేదు.
ఇదే విషయాన్ని ఎత్తి చూపిన మాజీ దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. పంత్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్ ఒకే రకమైన తప్పులు చేస్తున్నాడని చెప్పిన స్టెయిన్.. ‘‘ఈ సిరీస్లో పంత్కు నాలుగు అవకాశాలు లభించాయి. ప్రతిసారీ అతను ఒకే తప్పు చేశాడు. మంచి ఆటగాళ్లు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారని మనం అనుకుంటాం. కానీ పంత్ నేర్చుకోవడం లేదు’’ అని ఘాటైన కామెంట్స్ చేశాడు.
అదే సమయంలో దినేష్ కార్తీక్ తను దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడని, తను ఎంతటి క్లాస్ ఆటగాడో నిరూపించుకుంటున్నాడని చెప్పాడు. ఒకవేళ భారత్ కనుక ప్రపంచకప్ గెలవాలని అనుకుంటే.. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను తీసుకోవాలని సూచించాడీ మాజీ పేసర్. రెప్యుటేషన్ ప్రకారం కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారని, కానీ ప్రస్తుతం డీకే ఉన్న ఫామ్ను చూస్తుంటే ఆస్ట్రేలియా వెళ్లే విమానంపై కచ్చితంగా అతని పేరు ఉండి తీరాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.