క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు వచ్చే వ్యూయర్షిప్, డబ్బులే దీనికి ఉదాహరణ. మరే జట్ల మధ్య మ్యాచ్ జరిగినా ఇంత ఇంటెన్సిటీ కనబడదు. కానీ భారత్, పాక్ మ్యాచ్ అంటే చాలు.. ప్రపంచం మొత్తం అలా ఆగిపోయి చూస్తుంది. కానీ ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడంతో భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు.
ఈ క్రమంలో తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐకి ఒక సిఫారసు చేసిందని వార్తలొచ్చాయి. తమ దేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్కు ఆతిధ్యం ఇస్తామని చెప్పిందట. నెట్టింట దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఐస్ల్యాండ్ క్రికెట్ బోర్డు తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ వాతావరణం, ఆ దేశ క్రికెట్ బోర్డు ట్వీట్లు, అక్కడి సెక్యూరిటీపై ఐస్ల్యాండ్ క్రికెట్ బోర్డు జోకులు పేల్చింది.
‘భారత్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్కు ఆతిధ్యం ఇస్తామని ఈసీబీ ఆఫర్ ఇచ్చినట్లు మాకు తెలిసింది. మేం కూడా ఈ సిరీస్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఐసీసీకి అధికారికంగా ఆఫర్ ఇస్తున్నాం. అంతేకాదు, జూన్-జులై నెలల్లో దాదాపు 24 గంటల పాటు ఎండ, మ్యాచ్ కవర్ చేస్తూ మెరుగైన ట్వీట్లు, సెక్యూరిటీ కోసం స్నైపర్లను కూడా ఎరేంజ్ చేస్తాం’ అని ఐస్ల్యాండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ దీన్ని రిట్వీట్ చేస్తున్నారు. ఇంగ్లండ్లో ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతుంటాయి. ఈ కారణంగా చాలా టెస్టు మ్యాచులు కూడా ఆలస్యం అవడమో, రద్దు అవడమో జరుగుతుంటాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.
We hear @ECB_cricket have offered to host a Test series between India and Pakistan.
We officially announce to @ICC that we are also offering to do the same & can provide near 24 hour daylight in June and July, as well as better Tweets covering the matches. Sniper security too.
— Iceland Cricket (@icelandcricket) September 27, 2022