Ind vs Pak | భారీ అంచనాలతో, టైటిల్ ఫేవరెట్ ట్యాగ్ తగిలించుకొని టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన భారత జట్టు తొలి మ్యాచ్లోనే తేలిపోయింది. దాయాది పాకిస్థాన్పై ప్రపంచకప్ మ్యాచులన్నీ గెలిచిన రికార్డును చేజేతులారా చెరిపేసుకుంటూ బాబర్ సేనకు పది వికెట్ల భారీ విజయాన్ని కట్టబెట్టింది.
మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ వైఫల్యం ఘోరమే అయినా కోహ్లీ, రిషభ్ పంత్ పోరాడటంతో జట్టు పోరాడగలిగే స్కోరు చేసింది. కానీ భారత బౌలర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు. కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఈ క్రమంలో భారత్ బౌలర్లు, ముఖ్యంగా ఎన్నో అంచనాలతో వెటరన్ అశ్విన్ను పక్కనపెట్టి మరీ జట్టులోకి తీసుకున్న వరుణ్ చక్రవర్తి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఇదే విషయాన్ని పాక్ మాజీ సారధి సల్మాన్ బట్ ఎత్తిచూపాడు. ఇలాంటి మిస్టరీ స్పిన్ను పాక్ ఆటగాళ్లు గల్లీ క్రికెట్లోనే నేర్చుకుంటారని, చిన్నతనం నుంచి ఇలాంటి బంతులు ఎదుర్కోవడం వారికి అలవాటేనని చెప్పాడు. ‘పాకిస్థాన్లో పిల్లలు టేప్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడతారు. పిల్లలు తమ వేళ్లతో ట్రిక్స్ చేస్తూ బ్యాట్స్మెన్ను తికమక పెట్టడానికి ప్రయత్నించడం ఇక్కడ సర్వసాధారణం’ అని బట్ వివరించాడు.
అందుకే ఆదివారం జరిగిన పోరులో వరుణ్ చక్రవర్తిని పాక్ ఓపెనర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారని చెప్పాడు. ఐపీఎల్లో తన మిస్టరీ స్పిన్తో కోల్కతా తరఫున అద్భుతంగా రాణించిన వరుణ్ ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ విషయాన్నే చెప్పిన బట్.. క్రికెట్ ప్రపంచానికి మిస్టరీ స్పిన్ను పరిచయం చేసిన అజంతా మెండిస్ కూడా పాక్పై పెద్దగా ప్రభావం చూపని విషయాన్ని గుర్తుచేశాడు.
‘ప్రపంచంలో ఎన్నో జట్లను తన మిస్టరీ బౌలింగ్తో ఇబ్బంది పెట్టిన శ్రీలంక స్పిన్నర్ మెండిస్.. పాక్పై మాత్రం ప్రభావం చూపలేదు. అతని రికార్డు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అందుకే లంక అతన్ని పాక్పై పెద్దగా ఆడించలేదు. ఆ తర్వాత ఇండియాపై కూడా పెద్దగా ఆడించలేదు. మిస్టరీ స్పిన్ ఎవర్ని ఇబ్బంది పెట్టినా పాకిస్థాన్ ఆటగాళ్లకు అది సమస్యే కాదు. ఎందుకంటే వాళ్లు అలాంటి బంతులు ఆడుతూనే పెరుగుతారు’ అని సల్మాన్ బట్ వివరించాడు.
వరుణ్ వంటి వారిని చూడగానే బంతి ఎటువైపు వెళ్తుందో పాక్ బ్యాట్స్మెన్ అంచనా వేసేస్తారని పేర్కొన్నాడు. పాక్పై మెండిస్ రికార్డు గురించి టీమిండియా విశ్లేషకుడికి ఈ విషయం తెలియదేమో అని అభిప్రాయపడ్డాడు.