దుబాయ్: టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఓపెనింగ్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. ప్రపంచకప్లలో భారత్పై పాక్ గెలవడం ఇదే తొలిసారి కూడా. ఈ మ్యాచ్పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని కొనియాడిన అక్తర్.. ఆ తర్వాత భారత ఓటమికి టాస్ను కారణంగా పేర్కొన్నాడు. టాస్ ఓడినప్పుడే భారత జట్టు సగం మ్యాచ్ ఓడిందని అభిప్రాయపడ్డాడు.
‘మైదానంలో మంచు బౌలర్లకు పెద్ద అడ్డంకిగా మారింది. బంతి తడిగా మారడంతో భారత సీమర్లకు బంతి స్వింగ్ అవ్వలేదు. స్పిన్నర్లకు స్పిన్ అవ్వలేదు’ అని అక్తర్ వివరించాడు. అలాగే టీమిండియాపై అనవసరమైన ఒత్తిడి చాలా ఉందని చెప్పిన అతను.. భారత మీడియానే దీనికి కారణమని ఆరోపించాడు.
నెగిటివ్ స్పందనల అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డాడు. ‘పాకిస్థాన్పై ఓడిపోవడం అసాధ్యం, అదో పెద్ద నేరం అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. అదో క్రికెట్ మ్యాచ్. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు’ అని చెప్పాడు.
అదే సమయంలో ఇది టోర్నీ ఆరంభం మాత్రమే అని, ఈ ఓటమి తర్వాత ఫైనల్ చేరే ప్రయాణం కష్టమైనా భారత్ కచ్చితంగా ఫైనల్ చేరుతుందని తాను నమ్ముతున్నానని అన్నాడు. భారత జట్టుపై మరీ ఒత్తిడి ఎక్కువైందని, అందువల్లే వారు ఓడిపోయారని అభిప్రాయపడ్డాడు.
ఈ కారణంగా ఆటగాళ్లపై ద్వేష ప్రచారం చేయడం తగదని అభిమానులకు చెప్పాడు. అలా చేయడం సరికాదని, భారత్ ఇప్పటికీ ఫైనల్ చేరగలదని, ఫైనల్లో భారత్-పాకిస్థాన్ ఆడాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు.