దుబాయ్: టీ20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్లో కోహ్లీ, పంత్ తప్ప మిగతా ఎవరూ కనీస స్థాయి ప్రదర్శన కూడా చేయలేదు. బౌలింగ్లో అసలు ఎవరూ అంచనాలను అందుకోలేదు.
టీ20 ప్రపంచకప్లో అత్యంత శక్తిమంతమైన, అనుభవం ఉన్న బౌలింగ్ దళాల్లో ఒకటిగా పేరొందిన భారత్.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిదంటేనే బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు తమ కోపాన్ని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై కేంద్రీకరించారు.
పాక్పై ఈ వెటరన్ పేసర్ తన అనుభవాన్ని కూడా క్యాష్ చేసుకోలేకపోయాడు. మొత్తం 3.5 ఓవర్లు వేసిన అతను ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. యావరేజ్ 11.20 నమోదు చేశాడు. దీంతో నెటిజన్లు అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
షమీకి తన మద్దతు తెలిపాడు. ట్రోలింగ్ చేస్తున్న వారిని తప్పుబట్టాడు. ‘భారత జెర్సీ వేసుకుని ఆడే ప్రతి ఆటగాడి మనసులో ఇలాంటి ట్రోలర్ల కన్నా ఎక్కువగా దేశభక్తి ఉంటుంది. షమీపై కామెంట్స్ చూసి షాకయ్యా. ఈ విషయంలో క్రికెట్ ప్రపంచం అతని వెంట ఉంటుంది’ అని సెహ్వాగ్ అన్నాడు. ‘షమీ నీతోనే ఉన్నా. వచ్చే మ్యాచ్లో సత్తా చూపించు’ అంటూ ట్వీట్ చేశాడు.