కూసుమంచి (నేలకొండపల్లి), ఆగస్టు 18 : కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ కోటా సైదిరెడ్డి నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్పంచ్ కావడంతోనే బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లుల కోసం కాళ్లరిగేలా ఎంపీవో, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పెడితే దానికి అనుమతి లేదంటూ తెరవనీయడం లేదని, కనీసం పంచాయతీ ట్రాక్టర్ డీజిల్ బిల్లులు కూడా తీసుకోనివ్వడంలేదని ఆరోపించారు. ఎంపీడీవో ఎర్రయ్య, ఎస్సై శ్రీనివాసరెడ్డి.. బిల్లుల సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.