IND vs PAK | అంచనాలకు మించి రాణించిన పాకిస్థాన్ పేసర్లు ఆసియా కప్లో భాగంగా భారత్తో జరగిన పోరులో 10కి పది వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. నాణ్యమైన పేస్ను ఎదుర్కోవడం టీమ్ఇండియాకు కష్టమే అని మ్యాచ్కు ముందు నుంచే మాజీలు పేర్కొంటుండగా.. అనుకున్నదే జరిగింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ పేసర్లు అదరగొట్టారు. ప్రపంచంలో తమది అత్యుత్తమ పేస్ త్రయం ఎలా అయిందో పల్లెకెలెలో చూపించారు. తొలి స్పెల్లో నిప్పులు చెరిగిన షాహీన్ షా అఫ్రిది.. భారత దిగ్గఆజలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వెనక్కి పంపి ఆదిలోనే దెబ్బ కొట్టగా.. హరీస్ రవుఫ్ మిడిలార్డర్ పని పట్టాడు. మొత్తానికి షాహీన్, రవుఫ్, నసీమ్ ముగ్గురు కలిసి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఇందులో షాహీన్ 4 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. మిగిలిన ఇద్దరు మూడేసి వికెట్లు పడగొట్టారు.
పాక్ పేసర్ల జోరు చూస్తుంటే.. ఈ మ్యాచ్లో భారత్ కోలుకోవడం కష్టమే అనిపించినా.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా రాణించడంతో టీమ్ఇండియా మంచి స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో రోహిత్ సేన కోలుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్కు చక్కటి భాగ్వామ్యం నమోదు చేసి టీమ్ఇండియాను పోటీలోకి తెచ్చారు. ఫలితంగా భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (11), గిల్ (10), కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14), జడేజా (14), శార్దూల్ ఠాకూర్ (3) విఫలమయ్యారు. చివర్లో బుమ్రా (16; 3 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు