అహ్మదాబాద్: భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ విలవిల్లాడింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ విసిరే బంతులను ఎదుర్కోలేక జట్టులోని ఆరుగురు బ్యాటర్లు రెండంకెల స్కోర్ కూడా చేయకుండా పెవిలియన్ బాటపట్టారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండానే పాక్ తన ఇన్నింగ్స్ను ముగించింది. 42.5 ఓవర్లలో కేవలం 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్నే ఇచ్చినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (20; 3 ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాసేపటికే 73 పరుగుల వద్ద మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (36; 6 ఫోర్లు) హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్ (50; 7 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (49; 7 ఫోర్లు) నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే జట్టు స్కోర్ 155 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో ఆజమ్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి టీమ్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు. అయితే ఆ తర్వాత 16 పరుగుల వ్యవధిలోనే మరో నాలుగు వికెట్లు పడ్డాయి. పాక్ బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఔటై పెవిలియన్కు చేరుకున్నారు. దాంతో జట్టు స్కోర్ 35.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు.
ఆ తర్వాత మరో 20 పరుగులు జోడించి 42.5 ఓవర్లలో పాక్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.