మహిళల ఆసియాకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టులో కెప్టెన్ బిస్మా మరూఫ్ (32), నిదా దార్ (56 నాటౌట్) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ మహిళలు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో భారత జట్టు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.
భారత మహిళల్లో ఒక్కరు కూడా 30 స్కోరు చేయలేకపోయారు. రిచా ఘోష్ (26) టాప్ స్కోర్ కాగా.. దయాలన్ హేమలత (20), స్మృతి మంధాన (17), దీప్తి శర్మ (16), సబ్బినేని మేఘన (15) పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12) నిరాశపరచగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లతో చెలరేగగా.. నిదా దార్, సదియా ఇక్బాల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఐమాన్ అన్వర్, త్యూబా హసన్ కూడా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇలా పాకిస్తాన్ చేతిలో ఓడటం గత ఆరేళ్లలో భారత మహిళలకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు, ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్కు ఇదే తొలి ఓటమి కూడా.