దుబాయ్: భారత్, పాక్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. నరాలు తెగే ఉద్వేగానికి రెండు దేశాల అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన కొందరు అభిమానులు భారత ఆటగాళ్లను సరిగా ఆడొద్దంటూ వేడుకొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దుబాయ్ స్టేడియంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ప్రాక్టీస్ ముగించుకొని వెళ్తుండగా పాక్ అభిమానులు కేకలేసి అతన్ని పిలిచారు. స్టేడియం బయట నిలబడి ఉన్న యువతులు రాహుల్ను చూసి, ‘రాహుల్ రేపు మ్యాచ్లో దయచేసి మంచిగా ఆడకు. వద్దు, ప్లీజ్ రేపటి మ్యాచ్లో సరిగా ఆడకు‘ అని బతిమాడారు.
ఆ వెనుకే ధోనీ కూడా వచ్చాడు. అతన్ని చూసిన ఒక పాకిస్థాన్ ఫ్యాన్ ఏదో ప్రశ్న అడిగింది. దానికి బదులిచ్చిన ధోనీ ‘మా పని అలాంటిది’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇంతలో మిగతా పాక్ అభిమానులు ధోనీని ఉద్దేశించి, ‘మహీ.. వచ్చే మ్యాచ్ ఒక్కటి వదిలేయ్. ఈ మ్యాచ్ వద్దు ప్లీజ్’ అంటూ కేకలేశారు.