న్యూజిల్యాండ్తో రెండు టెస్టుల సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతోంది. టీ20 సిరీస్లో వైట్వాష్ ఎదుర్కొన్న కివీస్ జట్టు.. టెస్టుల్లో అయినా సత్తా చాటాలని, ప్రపంచ నెంబర్ వన్ టెస్టు జట్టు గౌరవాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. గురువారం నాడు ప్రారంభమయ్యే తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు.
అతని స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన అజింక్య రహానే ఫామ్లేమితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. కివీస్తో మ్యాచ్ నేపథ్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రహానేకు ఇదే ప్రశ్న ఎదురైంది.
దీనిపై ఘాటుగా స్పందించిన రహానే.. ’సెంచరీ చేస్తేనే జట్టుకు ఏదో చేసినట్లు కాదు. ఒక్కో ఇన్నింగ్సులో చేసే 20, 30, 40 పరుగులు కూడా జట్టుకు ఉపయోగపడతాయి. నా ఫామ్ గురించి నాకు చింత లేదు. సాధ్యమైనంతగా జట్టుకు ఉపయోగపడతానంతే’ అని స్పష్టం చేశాడు.
కొంతకాలంగా టెస్టుల్లో రహానే అత్యంత పేలవ ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. గత 11 టెస్టుల్లో అతను చేసిన పరుగులు కేవలం 372. ఈ మ్యాచుల్లో అతని సగటు 19.57.
ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని టెస్టు జట్టుకు ఎంపిక చేయడమే అదృష్టం అనుకుంటే, తొలి టెస్టులో కెప్టెన్సీ పగ్గాలు కూడా అందించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ కూడా ’జట్టులో ఇంతకాలం ఉన్నాడంటే.. రహానే చాలా అదృష్టవంతుడే’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.