Virat Kohli: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మూడో టెస్టుకైనా అందుబాటులో ఉంటాడా..? వ్యక్తిగత కారణాలని చెప్పి హైదరాబాద్, వైజాగ్ టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ.. రాజ్కోట్ టెస్టు వరకైనా జట్టులోకి వస్తాడా..? వారం రోజులుగా భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తాజాగా సమాధానం చెప్పాడు. వైజాగ్ టెస్టు ముగిసిన తర్వాత ద్రావిడ్ను విలేకరులు ఇవే ప్రశ్నలు సంధించడంతో అతడు నోరువిప్పాడు.
రాజ్కోట్ (గుజరాత్)లో జరుగబోయే మూడో టెస్టుకు కోహ్లీ ఆడతాడా..? లేదా..? అన్నదానిపై ద్రావిడ్ సమాధానం అతడి మాటల్లోనే… ‘మీరు ఈ ప్రశ్నను నన్ను కాకుండా సెలక్టర్లను అడిగితే మంచిది. మీ సందేహాలకు వాళ్లైతేనే సమాధానాలు చెప్పగలరు. ఎందుకంటే కొద్దిరోజుల్లోనే సెలక్టర్లు మిగిలిన మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. మేం కోహ్లీతో త్వరలోనే మాట్లాడి స్టేటస్ ఏంటనేది చెబుతాం..’ అని చెప్పాడు.
విరాట్ అందుబాటులో ఉంటాడా..? లేడా..? అన్నదానిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మూడో టెస్టుకు తాను అందుబాటులో ఉండలేనని కోహ్లీ అయితే ఇంతవరకూ మాకు చెప్పలేదు. తొలి రెండు టెస్టులలో తనకు లీవ్ కావాలని మాత్రమే అడిగాడు. బహుశా అతడు రాజ్కోట్ టెస్టు వరకు అందుబాటులో ఉండే అవకాశాలే ఉన్నాయి. అతడు నో చెప్పేదాకా మేం ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది..’ అని తెలిపాడు.
Rahul Dravid said – “We will connect with Virat Kohli and find out about his availability for the rest of Test series against England”. (Press) pic.twitter.com/DssjcLUsdz
— CricketMAN2 (@ImTanujSingh) February 5, 2024
కోహ్లీ భార్య అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నదని, కుటుంబం కోసమే విరాట్ స్వదేశంలో ఇంగ్లండ్తో రెండు టెస్టులకు దూరమయ్యాడని ఇటీవలే అతడి ఆప్తమిత్రుడు, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ లైవ్లో వెల్లడించిన విషయం విదితమే. మరి కోహ్లీ ఈనెల 15 నుంచి మొదలుకావాల్సి ఉన్న రాజ్కోట్ టెస్టు వరకైనా సిరీస్కు అందుబాటులో ఉంటాడా..? లేడా..? అన్నది త్వరలోనే తేలనుంది.