గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరిదైన టెస్టును ఎడ్జ్బాస్టన్లో శుక్రవారం నుంచి రెండు జట్లు ఆడనున్నాయి. అయితే ఇంగ్లండ్ జట్టు అప్పటి నుంచి మారిపోయింది. తాజాగా బెన్స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది.
అదే సమయంలో భారత జట్టు మాత్రం గాయాలు, ఫామ్లేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి కష్టకాలంలో తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జట్టులో తమ స్థానాలు సుస్థిరం చేసుకోవడానికి కొందరు భారత యువ ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.
ఆస్ట్రేలియా సిరీస్లో సత్తా చాటి అందరి దృష్టినీ ఆకర్షించిన శుభ్మన్ గిల్.. సెంచరీ మార్కు మాత్రం ఇప్పటి వరకు అందుకోలేకపోయాడు. గబ్బాలో అద్భుతంగా ఆడిన అతను.. ఆ తర్వాత గాయాలు, ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
దాంతో టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ జోడీ మొదటి చాయిస్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాయంతో సిరీస్కు దూరమవడం, మయాంక్ తడబడుతుండటంతో మరోసారి గిల్కు టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కనుక గిల్ ఉపయోగించుకుంటే కచ్చితంగా భారత టెస్టు జట్టులో తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.
భారత జట్టులో నయావాల్గా పేరొందిన ఛటేశ్వర్ పుజారా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా గుర్తింపు పొందిన ఆటగాడు హనుమ విహారి. ఫామ్లో లేని పుజారా స్థానంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడీ తెలుగు కుర్రాడు. కావాలంటే ఇన్నింగ్స్ ఓపెన్ చేసే సత్తా కూడా ఉన్న విహారి.. ఏ స్థానంలో అయినా ఆడగలడు.
అయితే పుజారా కౌంటీల్లో అదరగొట్టి ఫామ్లోకి రావడంతో భారత జట్టులో విహారి స్థానంపై మరోసారి క్వశ్చన్ మార్క్ పడింది. ఇలాంటి సమయంలో రాహుల్, రోహిత్ కూడా మ్యాచ్కు దూరమయ్యేలా ఉండటంతో విహారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, టీమిండియాలో పర్మినెంట్గా చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. భారత క్రికెట్లోకి రాకెట్ వేగంతో దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియాలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ స్పీడ్స్టర్.. తన సత్తాతో తక్కువ సమయంలోనే భారత జట్టులో విలువైన ఆటగాడిగా మారాడు.
దీంతో షమీ, బుమ్రాతోపాటు మూడో పేసర్గా ఇషాంత్ స్థానాన్ని తను ఆక్రమించాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో అత్యంత పేలవంగా ఆడిన సిరాజ్.. మళ్లీ తన ఫామ్ అందుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ టెస్టులో ఎలాగైనా రాణించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతోపాటు విమర్శకుల నోళ్లు మూయించాలని చూస్తున్నాడీ హైదరాబాదీ పేసర్.
వీళ్లు ముగ్గురూ ఈ టెస్టులో రాణించకపోతే వీళ్ల కెరీర్లు ఏమీ ముగిసిపోవు. తర్వాత ఎప్పటికో మరోసారి కచ్చితంగా అవకాశం వీళ్ల తలుపులు తడుతుంది. కానీ ఈ మ్యాచ్లో వీళ్లు విఫలమై ఇంగ్లండ్ గెలిస్తే.. చాలా కాలం తర్వాత ఇంగ్లిష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అద్భుత అవకాశం మాత్రం భారత జట్టు చేతుల్లో నుంచి జారిపోయే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో భారత జట్టు విజయాల కోసం కృషి చేసిన వీళ్లు తమకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకొని, టీమిండియాకు విజయాన్ని అందించడంతోపాటు జట్టులో వాళ్ల స్థానాలు కూడా సుస్థిరం చేసుకుంటారని ఆశిద్దాం.