భారత పర్యటన ఎలా సాగనుందో తొలి రోజే ఇంగ్లండ్కు తెలిసొచ్చింది. సుదీర్ఘ టెస్టు సిరీస్లో ‘బజ్బాల్’ ‘గిజ్బాల్’ జాన్తానై.. ఇక్కడ నడిచేదొక్కటే స్పిన్బాల్ అన్నట్లు.. మనవాళ్లు దుమ్మరేపడంతో.. ఇంగ్లిష్ టీమ్ తెల్ల మొహం వేసింది!
టెస్టుల్లో ధనాధన్ షాట్లు కొడతాం.. సుదీర్ఘ ఫార్మాట్లో పొట్టి పోరు మజా చూపుతాం అని బీరాలు పలికిన ఇంగ్లండ్ ప్లేయర్లు.. ఉప్పల్లో నిండా మూడు సెషన్లు కూడా క్రీజులో నిలువలేకపోయారు. అటు అశ్విన్, ఇటు జడేజా మాయాజాలానికి పెవిలియన్కు క్యూ కట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకే కుప్పకూలితే.. అసలు బజ్బాల్ అంటే ఏంటో.. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్టోక్స్ సేనకు రుచిచూపాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించి ఒక్క సెషన్లోనే ప్రత్యర్థి జట్టు పరుగుల్లో సగం బోర్డు మీద చేర్చాడు.
Ind Vs Eng Test | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐదేండ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి రోజే టీమ్ఇండియా అదరగొట్టింది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం ఉప్పల్లో ప్రారంభమైన మొదటి టెస్టులో రోహిత్సేన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత పిచ్లపై నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కష్టమని టాస్ గెలువగానే బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. బెయిర్స్టో (37), డకెట్ (35), జో రూట్ (29), క్రాలీ (20) మంచి ఆరంభాలను వినియోగించుకోలేకపోయారు. ఓలీ పోప్ (1), ఫోక్స్ (4) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా..బుమ్రా, అక్షర్ పటేల్ రెండీసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా.. గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో కదంతొక్కగా.. రోహిత్ శర్మ (24) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ ఏకైక వికెట్ పడగొట్టాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ప్రత్యర్థి స్కోరుకు 127 పరుగులు వెనుకబడి ఉంది. జైస్వాల్తో పాటు గిల్ (14) క్రీజులో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో టీ20 ఆటాడిన జైస్వాల్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇప్పటికే స్పిన్కు సహకరిస్తున్న పిచ్పై ఎదురుదాడే మంత్రంగా విరుచుకుపడిన జైస్వాల్.. ఇంగ్లండ్ బ్యాక్ఫుట్పైకి నెట్టేయగా.. రెండోరోజు మనవాళ్లు ఎలాంటి గేమ్ప్లాన్తో బరిలోకి దిగుతారో చూడాలి!
భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్కు వేదికైన ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం ప్రేక్షకులతో కళకళలాడింది. గతానికి భిన్నంగా ఈసారి స్లాండ్లన్నీ కనోపీలతో కొత్తగా కనిపించాయి. దీనికి తోడు స్టేడియంలో ఉన్న సీటింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఐదేండ్ల తర్వాత తొలిసారి నగరంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోసం జగన్మోహన్రావు సారథ్యంలోని హెచ్సీఏ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అభిమానులకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించింది. ఈసారి పాఠశాల విద్యార్థులను ఉచితంగా స్టేడియంలోకి అనుమతించారు. గురువారం ఆటకు 23,734 మంది హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో టెస్టు మ్యాచ్కు ఈ స్థాయిలో అభిమానులు రావడం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 (స్టోక్స్ 70, బెయిర్స్టో 37; అశ్విన్ 3/68, జడేజా 3/88), భారత్ తొలి ఇన్నిం గ్స్: 119/1 (యశస్వి 76 నాటౌట్, రోహిత్ 24; లీచ్ 2/24).