Ravindra Jadeja |టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాజ్కోట్ టెస్టులో మరోసారి తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. వికెట్లు తీయడానికి మూడు రోజుల పాటు ఇంగ్లండ్ బౌలర్లు తంటాలు పడ్డ నిర్జీవమైన రాజ్కోట్ పిచ్పై నాలుగో రోజు తన స్పిన్తో మాయ చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు ఓటమిని శాసించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం ద్వారా జడ్డూ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక టెస్టులో బ్యాట్తో సెంచరీ చేసి బంతితో ఐదు వికెట్లు తీసిన భారత క్రికెటర్లలో నాలుగోవాడిగా నిలిచాడు.
ఈ జాబితాలో విను మన్కడ్, పాలి ఉమ్రిగర్, రవిచంద్రన్ అశ్విన్లు జడేజా కంటే ముందున్నారు. జడేజా నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా జడేజాకు ఈ ఘనత అందుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 1952లో విను మన్కడ్ తొలిసారి.. ఇంగ్లండ్పై ఆడిన టెస్టులో బ్యాట్తో 184 పరుగులు చేయడమే గాక బంతితో ఐదు వికెట్లు (5/196) పడగొట్టాడు. 1962లో పాలి ఉమ్రిగర్.. వెస్టిండీస్తో ఆడిన టెస్టులో బ్యాట్తో 172 రన్స్ చేశాడు. బంతితో ఐదు వికెట్లు (5/107) తీశాడు.
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనతను మూడు సార్లు సాధించడం విశేషం. 2011లో వెస్టిండీస్తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో 103 పరుగులు చేసిన అశ్విన్.. ఐదు వికెట్లు (5/156) పడగొట్టాడు. 2016లో అతడు.. వెస్టిండీస్తో మ్యాచ్లో బ్యాట్ పట్టి సెంచరీ (113) చేయడమే గాక బంతితో ఏడు (7/83) వికెట్లు తీశాడు. 2021లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో శతకం (106) చేసి బంతితో మరో ఫైఫర్ (5/43) దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో జడేజా.. 2022లో శ్రీలకంతో మొహాలీ వేదికగా ముగిసిన మ్యాచ్లో 175 పరుగులు చేయడమే గాక ఐదు వికెట్ల (5/41) ఘనత అందుకున్నాడు. తాజాగా రాజ్కోట్ టెస్టులో బ్యాట్తో 112 రన్స్ చేసి బంతితో 5 వికెట్లు (5/41) సాధించాడు. ఈ ప్రదర్శనతో జడ్డూకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.