IND vs ENG: బ్యాటింగ్లో తడబడ్డా లక్నోలో భారత బౌలర్ల విజృంభణతో టీమిండియా గెలుపు దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. భారత పేస్ ధ్వయం జస్పిత్ర్ బుమ్రా, మహ్మద్ షమీల పదునైన పేస్కు ఇంగ్లండ్ టాపార్డర్ దాసోహమైంది. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్.. 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ ఇదే ఊపు కొనసాగిస్తే టోర్నీలో ఆరో విజయం రోహిత్ సేన సొంతమవడం పెద్ద కష్టమేమీ కాదు. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్.. నాలుగు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.
భారత్ను 229 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించేందుకు యత్నించింది. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో డేవిడ్ మలన్ (16).. సిక్స్, ఫోర్ కొట్టి జోరుమీద కనిపించాడు. కానీ బుమ్రా భారత్కు తొలి బ్రేక్ అందించాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి మలన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే జో రూట్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక షమీ వేసిన 8వ ఓవర్లో ఆఖరి బంతికి బెన్ స్టోక్స్ (౦) క్లీన్ బౌల్డ్ అవడంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపునకు మళ్లింది. అదే ఊపులో షమీ తన తర్వాతి ఓవర్లో ఓపెనర్ జానీ బెయిర్ స్టో (14) ను కూడా బౌల్డ్ చేసి భారత్ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న బట్లర్తో పాటు మోయిన్ అలీ, లివింగ్ స్టోన్, క్రిస్ వోక్స్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్కు పంపితే భారత్కు ఆరో విజయం పక్కా…!