IND vs ENG: ఇండియా – ఇంగ్లండ్ మధ్య ఇటీవలే హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో మ్యాచ్ను శాసించే స్థితి నుంచి పర్యాటక జట్టుకు రోహిత్ సేన విజయాన్ని అప్పగించింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ కాకుండా విరాట్ కోహ్లీ గనక సారథిగా ఉంటే హైదరాబాద్ టెస్టు ఫలితం మరో విధంగా ఉండేదని, భారత్ కచ్చితంగా గెలుస్తుందని ఇంగ్లండ్ మాజీ సారథి మైకెల్ వాన్ అన్నాడు. ‘క్లబ్ ప్రేరీ ఫైర్’ అనే యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టెస్టులో రోహిత్ సారథ్యం ఆర్డినరీగా ఉందని వాన్ అన్నాడు.
వాన్ మాట్లాడుతూ… ‘హైదరాబాద్ టెస్టులో వాళ్లు (భారత్) విరాట్ కెప్టెన్సీని మిస్ అయ్యారు. ఒకవేళ ఆ మ్యాచ్లో గనక విరాట్ సారథిగా ఉండుంటే భారత్ ఆ మ్యాచ్లో ఓడిపోయి ఉండేది కాదు. రోహిత్ గొప్ప ఆటగాడే. అందులో సందేహం లేదు. కానీ అతడు ఈ మ్యాచ్లో తనకేమీ పట్టనట్టు వ్యవహరించాడు..’ అని అన్నాడు.
హైదరాబాద్ టెస్టులో తొలుత రెండున్నర రోజుల పాటు భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కానీ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో ఓలీ పోప్ 196 పరుగులతో చెలరేగడంతో ఇంగ్లండ్ 420 పరుగుల భారీ స్కోరు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 202 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. వ్యక్తిగత కారణాల రీత్యా విరాట్ కోహ్లీ హైదరాబాద్తో పాటు వైజాగ్ టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే.