IND vs ENG 4th Test | ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ముందు బెన్ స్టోక్స్ సేన 192 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. జార్ఖండ్ రాజధాని రాంచీ లోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. ఆట తొలి రోజు నుంచే పిచ్పై పగుళ్లు రావడంతో ఇది స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా, అశ్విన్లు ఇంగ్లండ్ను ఇబ్బందులు పెట్టగా భారత్కు కూడా రెండు టెస్టుల అనుభవం కూడా లేని షోయభ్ బషీర్ చుక్కలు చూపెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను అశ్విన్ ఫైఫర్తో చుట్టేస్తే కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో కుమ్మేయడంతో ఇంగ్లండ్ విలవిల్లాడింది. మరి ఇలాంటి పిచ్పై 192 టార్గెట్ ఛేదించడం సాధ్యమేనా..?
మార్నింగ్ సెషన్ కీలకం..
సాధారణంగా భారత్లో పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా టెస్టులలో నాలుగో రోజు నుంచి బంతి గింగిరాలు తిరుగుతుంటుంది. ఈ క్రమంలో స్పిన్ పట్ల అవగాహన ఉన్న ఎంత గొప్ప బ్యాటర్ అయినా బోల్తా కొట్టాల్సిందే. ఫస్ట్ సెషన్లో ఆట అత్యంత కీలకం. రాంచీ టెస్టులోనే చూసుకుంటే ఇంగ్లండ్, ఇండియాలు ఎక్కువ వికెట్లు కోల్పోయింది ఈ సెషన్లోనే. తొలి రోజు ఇంగ్లండ్ను ఆకాశ్ దీప్ దెబ్బతీస్తే రెండో రోజు జడేజా దెబ్బకొట్టాడు. మూడో రోజు ఇంగ్లండ్ చేసిన 353 పరుగుల దిశగా కదులుతున్న భారత్ను ఇంగ్లండ్ దెబ్బతీసింది కూడా ఉదయం సెషన్లోనే కావడం గమనార్హం.
నాలుగో రోజు ఆటలో తొలి సెషన్లో వికెట్లను కాపాడుకోగలిగితే ఈ టార్గెట్ ఛేదించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ పిచ్ మాత్రం ఆందోళన రేకెత్తిస్తుందనడంలో సందేహమే లేదు. బషీర్తో పాటు హర్ట్లీ కూడా పిచ్పై ఉన్న పగుళ్లను, ఉదయం పూట తేమను ఉపయోగించుకుని త్వరత్వరగా వికెట్లు తీస్తే భారత్ ఒత్తిడిలోకి వెళ్లడం ఖాయం. అదీగాక రోహత్, గిల్, జడేజా, అశ్విన్ను మినహాయిస్తే బ్యాటర్లలో జైస్వాల్, సర్ఫరాజ్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్లు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టారు. వరుసగా వికెట్లు కోల్పోతే ఈ యువ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది కీలకం. అయితే ఇప్పటికే 192 పరుగుల ఛేదనలో 40 రన్స్ను పూర్తిచేసిన భారత్.. ఇంకా 152 పరుగులు చేస్తే సిరీస్ను చేజిక్కించుకునే అవకాశం చిక్కుతుంది.
End of a terrific day in Ranchi! 🏟️#TeamIndia need 152 more runs to win on Day 4 with 10 wickets in hand 👌👌
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/JPJXwtYrOx
— BCCI (@BCCI) February 25, 2024
రాంచీలో హయ్యస్ట్ టార్గెట్..
2013లో ప్రారంభమైన ఈ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టుతో కలిపి ఇప్పటివరకూ మూడు టెస్టులు మాత్రమే ఆడింది. 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ డ్రా కాగా 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ను ఇన్నింగ్స్ 202 పరుగులతో గెలుచుకుంది. అయితే దేశవాళీలో ఇక్కడ రెండుసార్లు మాత్రమే 200 ప్లస్ టార్గెట్ ఛేదించిన సందర్భాలున్నాయి. రంజీలలో భాగంగా 2020లో ఉత్తరాఖండ్ నిర్దేశించిన 203 పరుగులను జార్ఖండ్.. ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2016లో హిమాచల్ ప్రదేశ్ – జమ్మూ కాశ్మీర్ మధ్య ముగిసిన మ్యాచ్లో హిమాచల్.. 210 పరుగులను ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి రాంచీలో నాలుగో రోజు భారత జట్టు ఏం చేసేనో…!