IND vs ENG 3rd Test |రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా సారథి రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా టెస్టులలో ఫామ్లేమితో సతమతమవుతూ విమర్శలు ఎదుర్కుంటున్న హిట్మ్యాన్.. అంతగా అనుభవం లేని బ్యాటర్లతో కలిసి మూడో టెస్టు ఆడుతున్న భారత్ను కీలక సమయంలో ఆదుకున్నాడు. రాజ్కోట్ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా రోహిత్.. టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మేజర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో రోహిత్.. గంగూలీని అధిగమించాడు. 16 ఏండ్ల కెరీర్లో గంగూలీ.. 421 మ్యాచ్లలో 18,575 పరుగులు చేయగా తాజాగా హిట్మ్యాన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రాజ్కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భాగంగా రెండో సెషన్లో 65 పరుగులు పూర్తి చేయగానే అతడు దాదా రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వీరులు..
1. సచిన్ టెండూల్కర్ – 782 ఇన్నింగ్స్లలో 34,357 పరుగులు
2. విరాట్ కోహ్లీ – 580 ఇన్నింగ్స్లలో 26,733
3. రాహుల్ ద్రావిడ్ – 599 ఇన్నింగ్స్లలో 24,064
4. రోహిత్ శర్మ – 470 ఇన్నింగ్స్లలో 18,600 (రాజ్కోట్ టెస్టులో సెంచరీ చేయడానికంటే ముందే)
5. సౌరవ్ గంగూలీ – 485 ఇన్నింగ్స్లలో 18,575
ధోని రికార్డు కూడా..
రాజ్కోట్ టెస్టులో సెంచరీ చేసిన రోహిత్ ఈ క్రమంలో రెండు సిక్సర్లు బాదడంతో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో భారత్ తరఫున టెస్టులలో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. టెస్టులలో ధోని ఖాతాలో 78 సిక్సర్లుండగా రోహిత్ 80 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్.. 90 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.