IND vs ENG 3rd Test | ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది. రాజ్కోట్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో భాగంగా నాలుగో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. బెన్స్టోక్స్ సేనను 39.4 ఓవర్లలో 122 పరుగుల కే ఆలౌట్ చేసి 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పరుగుల పరంగా టెస్టులలో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. బజ్బాల్ ఆటతో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో బాదుడు సంగతి పక్కనబెడితే కనీసం బంతిని డిఫెండ్ చేయడానికి కూడా నానా తంటాలుపడ్డారు. ఆ జట్టు డిఫెన్స్లో పడి అసలు ఆటను మరిచిపోయి త్వరత్వరగా వికెట్లను చేజార్చుకుంది. రవీంద్ర జడేజా మరోసారి ఫైఫర్తో మెరవగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, బుమ్రాలకు ఒక వికెట్ దక్కింది.
జైస్వాల్ డబుల్..
196-2 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. ఆది నుంచి ధాటిగానే ఆడింది. శుభ్మన్ గిల్ (91) సెంచరీ మిస్ చేసుకున్నా మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మూడో రోజు చివర్లో వెన్నునొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వీ జైస్వాల్ (214 నాటౌట్).. నాలుగో రోజు బ్యాటింగ్కు వచ్చి ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ అతడు.. ఈ సిరీస్తో పాటు కెరీర్లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్) కూడా మెరవడంతో భారత్.. రెండో రోజు టీ విరామానికి ముందు 430-4 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్.. ఇంగ్లండ్ ఎదుట 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంగ్లండ్ టపటప..
భారీ ఛేదనలో ఇంగ్లండ్ బజ్బాల్ ఆటతో దూకుడుగా ఆడి భారత్కు ధీటుగా బదులిస్తుందేమోనని ఇంగ్లండ్ అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆశించారు. కానీ ఆ జట్టు అసలు మూడు ఓవర్ల దాకా పరుగుల ఖాతానే తెరలేదు. బాదుడు మంత్రాన్ని వాడే ఇంగ్లండ్.. అసలు అదేంటో తమకు సంబంధం లేదన్నట్టుగా ఆడారు. లక్ష్యం భారీగా ఉందని బెదిరారో లేక ఎలాగూ గెలవలేమన్న నిస్సహయతో ఏమో గానీ ఇంగ్లండ్ బ్యాటర్లు వచ్చినోళ్లు వచ్చినట్టే వెనుదిరిగారు. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఒకవైపు జడేజా, మరోవైపు కుల్దీప్లు ఇంగ్లండ్ను ఆటాడుకున్నారు. ఆఖర్లో అశ్విన్ కూడా వారికి జతకలవడంతో ఇంగ్లండ్.. 122 పరుగులకే ఆలౌట్ అయింది.
It’s @imjadeja with the final breakthrough 😎 #TeamIndia win the 3rd Test by 434 runs! 👏👏
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/A4juPRkWX8
— BCCI (@BCCI) February 18, 2024
ఇన్నింగ్స్ ఆదిలోనే బెన్ డకెట్ (4)ను జురెల్ అద్భుతంగా రనౌట్ చేయడంతో ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. ఆతర్వాత కొద్దిసేపటికే జాక్ క్రాలే(11)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఒలీ పోప్ (3), జో రూట్ (7), జానీ బెయిర్ స్టో (4)లను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (15)తో పాటు రిహాన్ అహ్మద్ (0)లను కుల్దీప్ ఔట్ చేశాడు. కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న బెన్ ఫోక్స్ (16) నూ జడ్డూనే బలిగొన్నాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసిన టామ్ హర్ట్లీని అశ్విన్ బౌల్డ్ చేశాడు. చివర్లో 15 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఇంగ్లండ్ను వంద పరగులు దాటించిన మార్క్ వుడ్.. జడేజా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.
India skittle England for 122 to secure a record win in Rajkot 🎉#WTC25 | #INDvENG 📝: https://t.co/vfmNIRVFiF pic.twitter.com/00UTiT92KL
— ICC (@ICC) February 18, 2024