IND vs ENG 2nd Test: భారత్ – ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ తొలి ఇన్నింగ్స్లో ఆకట్టుకున్నాడు. 72 బంతులు ఎదుర్కున్న రజత్.. 32 పరుగులే చేసినా యశస్వీ జైస్వాల్కు తోడుగా ఆడుతూనే పలు మంచి షాట్లు ఆడాడు. ఇంగ్లండ్ స్పిన్ త్రయం హర్ట్లీ, రియాన్ అహ్మద్, షోయబ్ బషీర్లతో పాటు జో రూట్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్లు ప్రేక్షకులను అలరించాయి. తనదైన ఆటతో అసలు సిసలు టెస్టు ప్లేయర్ అని తొలి ఇన్నింగ్స్లోనే నిరూపించుకున్నాడు. అయితే 30 ఏండ్ల వయసులో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో పని కాదని, కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా తానుమాత్రం దానిని సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు.
విశాఖపట్నంలో తొలి రోజు ఆట ముగిసిన తర్వాత యశస్వీ మాట్లాడుతూ.. ‘నా ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా ఆడాననిపిస్తోంది. కానీ నేను దానిని మరింత పెద్ద స్కోరు చేసుంటే ఇంకా బాగుండేది. భారత క్రికెట్లో చోటుకోసం వేచి చూడటం సర్వసాధారణమే. మనకు వేలాది మంది ప్లేయర్లు పోటీ ఉన్నారు. నేనైతే నా చేతుల్లో ఉన్న విషయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాను. 30 ఏండ్ల వయసులో నేను జాతీయ జట్టులోకి వచ్చాను. దానికి నాకు చింతించాల్సిన పనేమీ లేదు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఎవరికైనా కల నిజమవడం వంటిదే. మిడిలార్డర్లో ఆడటం వల్ల నాకేమీ ఇబ్బంది లేదు. దేశవాళీ క్రికెట్లో నేను మిడిలార్డర్లో వందలాది మ్యాచ్లు ఆడాను. నిన్న రాత్రి నేను హ్యాపీగా పడుకున్నా. మరుసటి రోజు మ్యాచ్లో నేను అరంగేట్రం చేయబోతున్నానని హైరానా పడలేదు..’ అని అన్నాడు.
ఇంగ్లండ్తో సిరీస్కు ముందు దేశవాళీతో పాటు ఇంగ్లండ్ లయన్స్తో ఆడటం తనకు కలిసొచ్చిందని పాటిదార్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో పాటు ఇంగ్లండ్తో ఆడటం వల్ల ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పాడు. ‘గత నెలలో ఇంగ్లండ్ లయన్స్తో సిరీస్లో అహ్మదాబాద్లో రెండు సెంచరీలు చేశాను. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి..’ అని చెప్పాడు. జైస్వాల్ గురించి స్పందిస్తూ.. అతడు మంచి ప్లేయర్ అని, తామిద్దరం క్రీజులో ఉన్నప్పుడూ వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండేలా ఆడామని చెప్పాడు. యశస్వీ బౌలర్లపై ఆది నుంచే ఆధిపత్యం చెలాయిస్తాడని, అది అతడిలో ఉన్న గొప్ప లక్షణమని కొనియాడాడు.