IND vs ENG 1st Test: భారత్ – ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇరు జట్లూ విజయం కోసం హోరాహోరి పోరాడినా ఇంగ్లండ్ అద్భుత బౌలింగ్తో భారత్కు షాకిచ్చింది. నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 420 పరుగుల భారీ స్కోరు చేయడంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో భారత టాపార్డర్, మిడిలార్డర్ బొక్క బోర్లా పడింది. రెండో ఇన్నింగ్స్లో భారత్.. 69.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్.. 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో119 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ను అశ్విన్ (84 బంతుల్లో 28, 2 ఫోర్లు), కోన శ్రీకర్ భరత్ (59 బంతుల్లో 28, 3 ఫోర్లు) లు ఆదుకోవడంతో భారత్ విజయానికి చేరువగా వచ్చినా తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హర్ట్లీ తన స్పిన్తో భారత్ను చుట్టేసి ఇంగ్లండ్కు విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్లో అతడు ఏడు వికెట్లు తీసి భారత్ను దెబ్బతీశాడు.
ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 316-6 తో నాలుగో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్.. మరో 104 పరుగులు జోడించింది. ఓలీ పోప్ (196) తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. రిహాన్ అహ్మద్ (28), టామ్ హర్ట్లీ (34)లు రాణించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 420 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా ముందు 231 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
భారత్ బ్యాటింగ్ వైఫల్యం..
లక్ష్య ఛేదనలో భారత్కు ఓపెనర్లు తొలి వికెట్కు 42 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో ధాటిగా ఆడిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో 35 బంతులాడి 15 పరుగులే చేశాడు. టామ్ హర్ట్లీ వేసిన 12వ ఓవర్లో భారత్కు డబుల్ షాకులు తాకాయి. జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ (౦) కూడా ఔటయ్యారు. 58 బంతులాడి 39 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను కూడా హర్ట్లీనే ఔట్ చేశాడు. 63 పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయింది.
ఈ క్రమంలో కెఎల్ రాహుల్ (22)కు జతగా భారత్ అక్షర్ పటేల్ (17)ను పంపింది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 32 పరుగులు జోడించారు. కానీ టీ విరామం తర్వాత భారత్ను హర్ట్లీ మళ్లీ దెబ్బకొట్టాడు. అక్షర్ పటేల్ను ఔట్ చేసి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆదుకుంటారనుకున్న రాహుల్, శ్రేయస్ అయ్యర్ (13)లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్లో 87 పరుగులు చేసిన రవీంద్ర జడేజా (2) స్టోక్స్ అద్భుతమైన త్రోకు రనౌట్ అయ్యాడు. అయ్యర్ను జాక్ లీచ్ ఔట్ చేయడంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న అశ్విన్ – భరత్..
క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్న భారత్ను సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తో పాటు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఆదుకున్నారు. స్పిన్తో విజృంభిస్తున్న ఇంగ్లండ్ బౌలర్లను ఈ జంట అద్భుతంగా అడ్డుకుంది. అనవసరమైన షాట్లకు పోకుండా.. మంచి బంతులను గౌరవిస్తూనే కాస్త గతి తప్పిన బంతులకే పరుగులు రాబట్టారు. 8 వికెట్కు ఈ ద్వయం 8వ వికెట్కు 57 పరుగులు జోడించింది. ఇంగ్లండ్ బౌలర్లను 21 ఓవర్ల పాటు నిలువరించారు.
ఆఖర్లో హర్ట్లీ మరో స్ట్రోక్..
ఫలితం ఆఖరి రోజుకు తేలడం ఖాయమని అశ్విన్ – భరత్లు సోమవారం ఉదయం వరకూ తీసుకెళ్తారని ఆశించిన భారత్ అభిమానులకు హర్ట్లీ వరుస షాకులిచ్చాడు. ఆట మరో రెండు ఓవర్లలో ముగుస్తుందనగా భరత్ను హర్ట్లీ బౌల్డ్ చేయడంతో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. అతడే వేసిన తర్వాతి ఓవర్లో అశ్విన్
ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఆఖరి బ్యాటర్గా వచ్చిన సిరాజ్(12) .. బుమ్రా (6) లు పదో వికెట్కు 25 పరుగులు జోడించి భారత శిభిరంలో ఆశలు రేపినా హర్ట్లీ వేసిన ఆఖరి ఓవర్లో సిరాజ్ స్టంపౌట్ అవడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.