IND vs BAN : మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ముస్తాఫిజుర్ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా ఆటగాళ్లు ఆది నుంచి తడబడ్డారు. నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్ ఓపెనర్ అనాముల్ హక్ (8 రన్స్)ను అవుట్ చేశాడు. ఆ వెంటనే లిట్టన్ దాస్ (29 పరుగులు)ను సిరాజ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మిడిలార్డర్లో షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీంలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, షకిబుల్ (43 పరుగులు)కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో బంగ్లా ఒత్తిడిలో పడింది. శార్థూల్ ఠాకూర్ కీలకమైన మెహిదీ హసన్ మిరాజ్ వికెట్ తీయడంతో బంగ్లా ఓటమి దాదాపు ఖరారైంది. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు తీశారు. సిరాజ్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్లకు ఒక్కో వికెట్ దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ విరోచితంగా బ్యాటింగ్ చేసి కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్లో కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్తో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 44వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలిపి 72వ శతకం. ఇషాన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివర్లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా 50 ఓవర్లకు 409 రన్స్ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్, షకిబుల్ హసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ముస్తాఫిజుర్ రెహమాన్, మెహదీ మిరాజ్ చెరో వికెట్ తీశారు. అయితే.. మూడు వన్డేల సిరీస్లో మొదటి రెండు వన్డేల్లో గెలిచిన బంగ్లాదేశ్ ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది.