ఢాకా: బంగ్లాదేశ్తో రెండో వన్డేలో 272 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడమే లక్ష్యంగా బరిలో దిగిన భారత జట్టుకు ఆదిలో ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టు స్కోరు 13 పరుగులు ఉన్నప్పుడే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఓవర్ ఐదో బంతికి ఏడు పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (5) ఎబాదత్ హుస్సేన్ బౌలింగ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో మెహదీ హసన్కు క్యాచ్ ఇచ్చి శిఖర్ ధవన్ (8) పెవిలియన్ ముఖం పట్టాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (6), వాషింగ్టన్ సుందర్ జట్టును గాడిలో పెట్టే పనిలో ఉండగానే సుందర్ (11).. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సుందర్ ఔటయ్యేటప్పటికీ జట్టు స్కోరు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 39 పరుగులుగా ఉంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ రెండో వన్డే జరుగుతున్నది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది.