ఢాకా: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ జట్టు పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడుతోంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకపోవడంతో బ్యాటర్లకు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. దానికి తోడు భారత బౌలర్ల పదునైన బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. దాంతో జట్టు స్కోరు 100 పరుగుల మైలురాయిని దాటడానికి 26 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. అప్పటికే బంగ్లా జట్టు కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయింది.
రెండో ఓవర్ ఐదో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ అనముల్ హక్ (11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు కూడా 11 పరుగులు మాత్రమే. ఆ తర్వాత 10వ ఓవర్ రెండో బంతికి జట్టు స్కోరు 39 పరుగులు ఉన్నప్పుడు మహ్మద్ సిరాజ్ బౌలింగ్లోనే కెప్టెన్ లిటన్ దాస్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 52 పరుగుల వద్ద 14వ ఓవర్ మొదటి బంతికి ఊపు మీదే ఉన్నట్లు కనిపించిన నజ్ముల్ హుస్సేన్ షాంటో (21) ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో బౌల్డయ్యాడు.
ఆ తర్వాత 17వ ఓవర్ ఆఖరి బంతికి షకీబ్ అల్ హసన్ (8) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో శిఖర్ ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 66 పరుగులు మాత్రమే. ఆ తర్వాత 19వ ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీం (12).. సుందర్ బౌలింగ్లోనే శిఖర్ ధవన్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 69 పరుగులు. ఆ తర్వాత బంతికే సుందర్ బౌలింగ్లోనే అఫీఫ్ హుస్సేన్ పరుగులేమీ చేయకుండానే బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత మహ్మదుల్లాకు తోడుగా మెహదీ హసన్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. 26 ఓవర్లు ముగిసే సరికి మహ్మదుల్లా, మెహదీ హసన్ చెరో 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.