ఢాకా: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లా జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని పరుగుల వరద పారించింది. 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న జట్టును మహ్మదుల్లా, మెహదీ హసన్ తమ అద్భుత ఆట తీరుతో గాడిలో పెట్టారు. మెహదీ హసన్ సెంచరీ (83 బంతుల్లో 100) చేసి జట్టును ఆదుకున్నాడు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత జట్టు ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ రెండో ఓవర్ ఐదో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ అనముల్ హక్ (11) వికెట్ కోల్పోయింది. 10వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ లిటన్ దాస్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 52 పరుగుల వద్ద 14వ ఓవర్ మొదటి బంతికి ఊపు మీదే ఉన్నట్లు కనిపించిన నజ్ముల్ హుస్సేన్ షాంటో (21) ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. తర్వాత 17వ ఓవర్ ఆఖరి బంతికి షకీబ్ అల్ హసన్ (8) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో శిఖర్ ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
19వ ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీం (12) కూడా సుందర్ బౌలింగ్లోనే శిఖర్ ధవన్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే సుందర్ బౌలింగ్లోనే అఫీఫ్ హుస్సేన్ పరుగులేమీ చేయకుండానే బౌల్డ్ అయ్యాడు. అనంతరం మహ్మదుల్లాకు తోడుగా మెహదీ హసన్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఏడో వికెట్కు 148 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆఖరికి 47వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వారి భాగస్వామ్యానికి తెరదించినా.. క్రీజులోకి వచ్చిన నజుమ్ అహ్మద్ (18) వేగంగా పరుగులు రాబట్టాడు.