ఇండోర్: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇండోర్లో జరుగుతున్న రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. కేవలం పది ఓవర్ల ఆట మాత్రమే సాగింది. పదో ఓవర్ ఐదో బంతి పడగానే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాంతో ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఒకవేళ వరుణుడు శాంతిస్తే ఓవర్లను కుదించి ఆట కొనసాగించనున్నారు. లేదంటే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉన్నది.
ఈ మ్యాచ్కు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 16 పరుగులు ఉన్నప్పుడు ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి అతని వ్యక్తిగత స్కోర్ కేవలం 8 పరుగులే.
ఆ తర్వాత వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్తో కలిసి మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. 9.5 ఓవర్ల ఆట పూర్తయ్యే సమయానికి గిల్, అయ్యర్ 63 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. అప్పటికి జట్టు స్కోర్ ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు. సరిగ్గా అప్పుడే భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.