ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు రాణించడంతో 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఈ స్కోరును కాపాడుకోలేకపోయింది. బౌలర్లలో భువనేశ్వర్, హర్షల్ పటేల్, చాహల్, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్యా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ ఓడిపోయేలా కనిపించలేదు.
దీనిపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాగైతే వచ్చే టీ20 ప్రపంచకప్ను భారత్ గెలవడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. ‘బుమ్రా, హర్షల్ తిరిగొస్తే అంతా సర్దుకుంటుంది అనుకున్నాం. కానీ అలా జరగదు. అదే జీవితంలో చేదు నిజం. ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా ఉన్నాడు. అతను ఉన్నా.. మిగతా వాళ్లు సరిగా బౌలింగ్ చెయ్యకపోతే ఏం జరుగుతుందో చూశాం కదా.
ఏదో ఒక మ్యాచ్లో ఒక బౌలర్ ఐదు-ఆరు వికెట్లు తీయగలుగుతాడు. కానీ మిగతా రోజుల్లో అన్ని వికెట్లు తీయలేం కదా’ అని ఆకాష్ వివరించాడు. భారత జట్టు బౌలింగ్ విభాగం అత్యంత బలహీనంగా ఉందనేది వాస్తవమని, ఈ లైనప్తో ప్రపంచకప్ గెలుస్తామనే ఆశలు సన్నగిల్లుతాయని తేల్చేశాడు. 208 పరుగుల భారీ స్కోరును కూడా డిఫెండ్ చేసుకోలేకపోతే పరిస్థితులు క్లిష్టంగా మారతాయని చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియా జట్టులో నలుగురు కీలక ఆటగాళ్లు లేరనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నాడు.