ఆసియా కప్లో నిరాశాజనక ప్రదర్శన చేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్నకు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో టీ20 సిరీసులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు మొత్తం మూడు టీ20 మ్యాచులు ఆడుతుండగా.. చివరిదైన మూడో మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు సెప్టెంబరు 15 అంటే గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయి. పేటీయం ఇన్సైడర్ ద్వారా వీటిని అభిమానులు కొనుగోలు చేయొచ్చు. టికెట్ ధరలు రూ.300 నుంచి రూ.10 వేల మధ్య ఉండనున్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడే టీ20 సిరీసుల్లో భారత జట్టు దాదాపు ప్రపంచకప్ జట్టునే ఆడిస్తోంది. దాంతో టీం సత్తా తెలుసుకునేందుకు ఈ సిరీసులు బాగా ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.