5 ఈ సిరీస్లో ఆడిన ఆరు ఇన్నింగ్స్ల్లో ఐదు సార్లు 200 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి.
పరుగుల వరద పారుతున్న పొట్టి సిరీస్లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. గత ఆరు ఇన్నింగ్స్ల్లో ఐదుసార్లు రెండొందల పైచిలుకు పరుగులు నమోదైన భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్లో నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం భారత జట్టు పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపుతుంటే.. స్టార్లు స్వదేశానికి తిరిగి వెళ్లడంతో ఆస్ట్రేలియా కొత్తగా కనిపిస్తున్నది! శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరడంతో యంగ్ ఇండియా బలం మరింత పెరగగా.. అతడి కోసం తెలంగాణ కుర్రాడు తిలక్వర్మపై వేటు వేస్తారా చూడాలి!
రాయ్పూర్: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని భారత జట్టు యువ ఆటగాళ్లకు అత్యధిక అవకాశాలు కల్పిస్తున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో టీమ్ఇండియా రెండు, ఆసీస్ ఒక మ్యాచ్ నెగ్గగా.. నేడు రాయ్పూర్ వేదికగా నాలుగో టీ20 జరగనుంది. గత మూడు మ్యాచ్ల్లోనూ భారత బ్యాటర్లు దంచికొట్టినా.. బౌలర్లు మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారనే చెప్పాలి. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయడంలో మనవాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. వివాహం కారణంగా గత మ్యాచ్కు దూరమైన ముఖేశ్ యాదవ్ రాకతో బౌలింగ్ పెరగడం ఖాయమే కాగా.. అసాధ్యం అనుకున్న సమయంలో అవలీలగా లక్ష్యాన్ని ఛేదించిన అరవీర భయంకర బ్యాటర్ మ్యాక్స్వెల్ ప్రస్తుత ఆసీస్ జట్టులో లేకపోవడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో అధిక శాతం మంది మెగాటోర్నీ ముగియగానే స్వదేశానికి వెళ్లగా.. మూడు మ్యాచ్లు ఆడిన అనంతరం మిగిలిన వాళ్లు కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టులో సభ్యుడైన ట్రావిస్ హెడ్ మాత్రమే ఆసీస్ జట్టులో ఉన్నాడు. దీంతో కంగారూలు కూడా యంగ్ ప్లేయర్లను పరీక్షించాలని కోరుకుంటున్నది. గత మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఊచకోతతో కాస్తలో విజయానికి దూరమైన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఈసారి ఎలాంటి పొరబాటు చేయకుండా సిరీస్ పట్టేయాలని భావిస్తుంటే.. మరోవైపు కంగారూలు మాత్రం సమం చేయాలని చూస్తున్నారు.
గత మ్యాచ్లను పరిశీలిస్తే.. భారత జట్టు డెత్ ఓవర్స్లో ప్రత్యర్థికి ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నది. మూడో టీ20లో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు ఓవర్లలో 68 పరుగులు ఇచ్చుకొని చెత్త రికార్డు మూటగట్టుకోగా.. మిగిలినవాళ్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే గత మ్యాచ్కు బ్రేక్ తీసుకున్న ముఖేశ్ రాకతో కాస్త బలం పెరగడం ఖాయం కాగా.. అవేశ్, అర్ష్దీప్ ప్రసిద్ధ్ మరింత మెరుగవక తప్పదు. తొలి మూడు మ్యాచ్లకు అందుబాటులో లేకపోయిన వరల్డ్కప్ హీరో శ్రేయస్ అయ్యర్ రాకతో తుది జట్టులో మార్పులు చోటు చేసుకోవడం ఖాయమే అనిపిస్తున్నది. సాధారణంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే శ్రేయస్ కోసం హైదరాబాదీ తిలక్ తప్పుకోవాల్సి రావచ్చు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్, రింకూసింగ్తో బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తున్నది. అయితే ఆసీస్ బౌలర్లలో బెహ్రాన్డార్ఫ్తో భారత లైనప్కు ముప్పు పొంచి ఉంది.
సీనియర్ ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వెళ్లడంతో ఆస్ట్రేలియా కొత్తగా కనిపిస్తున్నది. వన్డే ప్రపంచకప్ మధ్యలో జట్టులో చేరిన ట్రావిస్ హెడ్ తప్ప మిగిలిన వాళ్లంతా వెళ్లిపోగా.. కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఐపీఎల్ వేలానికి ముందు మంచి ప్రదర్శన చేసి ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు వారికి ఇదో చక్కటి అవకాశం కానుంది. గువాహటిలో జరిగిన మూడో మ్యాచ్లో మ్యాక్స్వెల్ వీర విధ్వంసంతో జట్టును గెలిపించి సిరీస్లో సజీవంగా నిలుపగా.. ఈ మ్యాచ్లోనూ అదే జోష్ కొనసాగించి సమం చేయాలని కంగారూలు చూస్తున్నారు. బ్యాటింగ్లో హెడ్ ఎంతటి విధ్వంసం సృష్టించగలడో ఇప్పటికే పలుమార్లు నిరూపించుకోగా.. అతడితో పాటు షార్ట్, టిమ్ డేవిడ్, వేడ్, గ్రీన్ కీలకం కానున్నారు. ఇక బౌలింగ్లో బెహ్రాన్డార్ఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు.. భారత బ్యాటర్లకు సింహస్వప్నంలా నిలుస్తున్నాడు.
రాయ్పూర్ పిచ్ అటు బ్యాటింగ్కు ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించనుంది. బౌండ్రీలు పెద్దవి కావడంతో పెద్ద షాట్లు కొట్టడం అంత సులభం కాదు. వాతావరణం సాధారణంగా ఉండనుంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు.
భారత్: సూర్య (కెప్టెన్), యశస్వి, రుతురాజ్, ఇషాన్, శ్రేయస్/తిలక్, రింకూసింగ్, అక్షర్, రవి, అర్ష్దీప్/దీపక్, ప్రసిద్ధ్/అవేశ్, ముఖేశ్.
ఆస్ట్రేలియా: వేడ్ (కెప్టెన్), హెడ్, ఆరోన్, షార్ట్, మెక్డర్మాట్, టిమ్ డేవిడ్, గ్రీన్, డ్వార్షే, ఎలీస్, బెహ్రాన్డార్ఫ్, తన్వీర్.