హైదరాబాద్ నగరంలో టీ20 క్రికెట్ మ్యాచ్ సందడి నెలకొంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్ హైదరాబాద్లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియం వేదికగా ఆదివారం నాడు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హోటల్ తాజ్ కృష్ణలో ఆస్ట్రేలియ ఆటగాళ్లకు, పార్క్ హయత్లో టీమిండియా ఆటగాళ్లకు బస ఏర్పాటు చేస్తున్నారు.
సుమారు మూడేళ్ల తర్వాత ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగడం, దానికితోడు కరోనా కారణంగా గత రెండు సీజన్ల ఐపీఎల్ మ్యాచులు కూడా ఇక్కడ లేకపోవడంతో.. క్రీడాభిమానులు ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. దీనికితోడు శుక్రవారం నాడు జరిగిన రెండో టీ20లో భారత్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో హైదరాబాద్లో జరిగే మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ కైవశం అవుతుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
శంషాబాద్ చేరుకున్న టీమిండియా..
ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సభ్యులు సాయంత్రం 6.30 సమయంలో శంషాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య వాళ్లందర్నీ హోటల్ తాజ్ కృష్ణకు తరలించారు అధికారులు. శనివారం నాడు హోటల్లో విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు.. ఆదివారం నాడు సిరీస్ డిసైడర్లో ఆస్ట్రేలియాతో తలపడనున్నారు.