ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వచ్చే ఆదివారం నాడు జరిగే టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. క్రీడాభిమానులంతా గుంపులు గుంపులుగా టికెట్ల కోసం ఎగబడటంతో జింఖానా వద్ద తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. దీనిలో పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కారణమంటూ కొందరు మండిపడుతున్నారు.
అయితే తమకు ఈ తొక్కిసలాటతో అసలు ఎలాంటి సంబంధం లేదని హెచ్సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. టికెట్లు అమ్మే కాంట్రాక్ట్ను థర్డ్ పార్టీకి ఇచ్చామని, అలాంటప్పుడు టికెట్ల అమ్మకాల సమయంలో జరిగిన గొడవకు తమతో సంబంధం ఏంటని అజారుద్దీన్ ప్రశ్నించారు. స్టేడియం వద్ద జరిగింది చాలా దుర్ఘటన అని చెప్పిన ఆయన.. దానికి తమను బాధ్యులు చేయడం సరికాదన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య గురించి ప్రశ్నించగా.. ‘సెప్టెంబరు 15న మొత్తం 11,450 టికెట్లు ఆన్లైన్లో అమ్మారు. ఆ తర్వాత కార్పొరేట్ బాక్స్ టికెట్లు 4000 అమ్మారు. తర్వాత ఆఫ్లైన్లో 3 వేల టికెట్లు అమ్మి, మళ్లీ ఆన్లైన్లో గురువారం నాడు 2100 టికెట్లు అమ్మకానికి పెట్టారు. ఇవికాక సుమారు 6వేల టికెట్లను స్టేక్హోల్డర్లు, అసోసియేషన్ భాగస్వాములకు అందజేశాం’ అని లెక్కలు చెప్పారు. అయితే ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 55 వేల సీట్లు కాగా, వీటిలో కనీసం 39 వేల టికెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ అలా జరగకపోవడం గమనార్హం.