ఎముకలు కొరికే చలి.. చేతులు గడ్డగట్టించే శీతల వాతావరణంలో.. టీమ్ఇండియా అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో కదంతొక్కిన రోహిత్ సేన.. అఫ్గానిస్థాన్పై తొలి టీ20లో విజయం సాధించింది. 14 నెలల విరామం తర్వాత రోహిత్ తొలిసారి పొట్టి ఫార్మాట్లో దర్శనమివ్వగా.. చాన్నాళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ శివమ్ దూబే అటు బంతితో ఇటు బ్యాట్తో దుమ్మురేపగా.. హైదరాబాదీ యంగ్ గన్ తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు.
Ind Vs Afg t20 | మొహాలీ: పొట్టి ప్రపంచకప్ జరగనున్న ఏడాదిలో టీమ్ఇండియా ఈ ఫార్మాట్లో విజయంతో ఖాతా తెరిచింది. మెగాటోర్నీకి ముందు ఆడుతున్న చివరి సిరీస్లో రోహిత్ సేన శుభారంభం చేసింది. ఇటీవల అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. విపరీతమైన చలి వాతావరణంలో.. ఆటగాళ్లు బంతి పట్టుకోవడం కూడా కష్టంగా మారిన సమయంలో మనవాళ్లు చక్కటి ప్రదర్శన చేశారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. దానికి ముందు భారత్ ఆడుతున్న చివరి పొట్టి సిరీస్ ఇదే కావడం గమనార్హం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు పెట్టింది. మహమ్మద్ నబీ (42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అజ్మతుల్లా (29), ఇబ్రహీం (25), రహ్మానుల్లా (23) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో మెరవగా.. జితేశ్ శర్మ (31; 5 ఫోర్లు), తిలక్ వర్మ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), గిల్ (23; 5 ఫోర్లు) రాణించారు. గిల్తో సమన్వయ లోపంతో కెప్టెన్ రోహిత్ (0) రనౌట్గా వెనుదిరిగాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. దూబేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 జరగనుంది.
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య పోరులో విచిత్ర సంఘటనలు దర్శనమిచ్చాయి. స్వదేశంలో టీమ్ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే.. మైదానాలు నిండిపోవడం మామూలే కాగా.. మ్యాచ్ ఆరంభమయ్యేంత వరకు స్టేడియంలో అసలు ఒక్క అభిమాని కూడా కనిపించలేదు. టాస్ వేస్తున్న సమయంలో కూడా స్టాండ్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ సిరీస్పై ఫ్యాన్స్కు పెద్దగా ఆసక్తి లేదనుకుంటే పొరబడినట్లే! దీనంతటికీ అసలు కారణం చలి. మొహాలీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఇటు ఆటగాళ్లు, అటు అభిమానులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఫీల్డ్ అంపైర్లు ఎప్పుడూ లేని విధంగా గ్లౌజ్లు వేసుకొని విధులు నిర్వర్తించగా.. ఫీల్డర్లు మాత్రం ఎక్కువ శాతం చేతులు జేబుల్లో పెట్టుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే పదే పదే చేతులు వణకకుండా.. సహాయ సిబ్బంది ద్వారా వేడి నీటితో కూడిన ప్రత్యేక ప్యాకెట్ తెప్పించి కాస్త శరీర ఉష్ణోగ్రత పెంచుకునేందుకు ప్రయత్నించాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయానికి స్టేడియం నిండిపోయినా.. అందరూ జాకెట్లతో దర్శనమిచ్చారు. మ్యాచ్ జరుగుతున్నా కొద్ది పొగమంచు పెరుగుతూ పోయింది.
అఫ్గానిస్థాన్: 158/5 (నబీ 42, అజ్మతుల్లా 29; అక్షర్ 2/23, ముఖేశ్ 2/33),
భారత్: 17.3 ఓవర్లలో 159/4 (దూబే 60 నాటౌట్, జితేశ్ 31; ముజీబ్ 2/21).