Ind Vs Eng Test | ధర్మశాల టెస్టులో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమైన చోట మనోళ్లు శతక గర్జన పూరించారు. కెప్టెన్ రోహిత్శర్మ, శుభ్మన్గిల్ సూపర్ సెంచరీలతో చెలరేగిన వేళ..టీమ్ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. ఇంగ్లిష్ బౌలర్లను దునుమాడుతూ గిల్, రోహిత్ సెంచరీలకు తోడు దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ఖాన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. మొత్తంగా టాప్-5 బ్యాటర్లు అర్ధసెంచరీలు, సెంచరీలతో కదంతొక్కారు. మిడిలార్డర్ తడబడినా..ఆఖర్లో కుల్దీప్, బుమ్రా నిలదొక్కుకోవడంతో రోహిత్సేన పటిష్ట స్థితిలో నిలిచింది. రోజంతా చెమటోడ్చిన ఇంగ్లండ్ ఏడు వికెట్లతో సరిపెట్టుకుంది.
ధర్మశాల: హిమాలయ పర్వత పాదాల్లో భారత్, ఇంగ్లండ్ ఆఖరి పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే కట్టడిచేసిన టీమ్ఇండియా బ్యాటింగ్లో ఇరుగదీస్తున్నది. స్పిన్ తంత్రం తో ఇంగ్లండ్ కుదేలైన పిచ్పై భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. కెప్టెన్ రోహిత్శర్మ (162 బంతుల్లో 103, 13ఫోర్లు, 3సిక్స్లు), శుభ్మన్ గిల్(150 బంతుల్లో 110, 12ఫోర్లు, 5సిక్స్లు) సూపర్ సెంచరీలతో విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది.
వీరికి తోడు అరంగేట్రం బ్యాటర్ దేవదత్ పడిక్కల్(103 బంతుల్లో 65, 10ఫోర్లు, సిక్స్), సర్ఫరాజ్ఖాన్(60 బంతుల్లో 56, 8ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. అయితే లోయార్డర్లో జడేజా (15), జురెల్ (15), అశ్విన్ (0) నిరాశపరిచారు. ఆఖర్లో కుల్దీప్యాదవ్ (27 నాటౌట్), బుమ్రా (19 నాటౌట్) క్రీజులో నిలదొక్కుకోవడంతో తిరిగి వికెట్లు చేజార్చుకోలేదు. మొత్తంగా రెండు వికెట్లు చేతిలో ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 255 పరుగుల కీలక ఆధిక్యంలో కొనసాగుతున్నది. షోయబ్ బషీర్ (4-170), టామ్ హార్ట్లే (2-126) ఆకట్టుకున్నారు.
గిల్, రోహిత్ విజృంభణ:
ఓవర్నైట్ స్కోరు 135-1 రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ దూకుడు ప్రదర్శించింది. పిచ్ బౌలింగ్కు అంతగా అనుకూలించని వేళ..అదునుగా భావిస్తూ రోహిత్, గిల్..ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బౌండరీలతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా నింపాదిగా ఇన్నింగ్స్ను కొనసాగించారు.
వీరిని విడదీసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. లంచ్ విరామ సమయానికి సింగిల్ ద్వారా రోహిత్ టెస్టుల్లో 12వ సెంచరీని ఖాతాలో వేసుకుంటే..బషీర్ బౌలింగ్లో చూడచక్కని ఫోర్ ద్వారా గిల్ శతకాన్ని పూరించాడు. రోహిత్ తన ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 3 భారీ సిక్స్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఔట్ ప్రమాదం నుంచి బయటపడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు జోడించింది. మళ్లీ బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా వరుస విరామాల్లో రోహిత్, గిల్ వికెట్లను కోల్పోయింది. ఈ సిరీస్లో తొలిసారి బౌలింగ్కు దిగిన స్టోక్స్ సూపర్స్వింగ్తో రోహిత్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 171 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో గిల్ను అండర్సన్ను క్లీన్బౌల్డ్ చేశాడు. అయితే ఇక్కడ మ్యాచ్పై పట్టు బిగించాలనుకున్న ఇంగ్లండ్కు..పడిక్కల్, సర్ఫరాజ్ దీటుగా నిలబడ్డారు. ఆడుతున్నది తొలి టెస్టు అయినా..పడిక్కల్ సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
మరోవైపు సర్ఫరాజ్..పడిక్కల్కు చక్కని సహకారం అందించాడు. పేస్ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఒక వైపు అయితే పడిక్కల్ ఫ్రంట్ఫుట్, బ్యాక్ఫుట్ డ్రైవ్లతో చూడచక్కని బౌండరీలు కొట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బషీర్ విడగొట్టాడు. స్లిప్లో రూట్ క్యాచ్తో ఖాన్ పెవిలియన్ చేరడంతో నాలుగో వికెట్కు 97 పరుగుల పార్టనర్షిప్నకు ఫుల్స్టాప్ పడింది. బషీర్ బౌలింగ్లో పడిక్కల్ బోల్డ్ కావడంతో ఇన్నింగ్స్ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన పడిక్కల్, జడేజా, అశ్విన్ వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో ఆలౌట్ అవుతుందా అనుకున్న తరుణంలో కుల్దీప్యాదవ్, బుమ్రా ఇంగ్లండ్ బౌలర్లను ఎదురొడ్డి నిలిచారు.
4 టెస్టుల్లో ఇంగ్లండ్పై టాప్-5 బ్యాటర్లు అర్ధసెంచరీ, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం భారత్కు ఇది తొలిసారి. ఓవరాల్గా నాలుగోసారి టీమ్ఇండియా ఈ ఫీట్ అందుకుంది.
2 అన్ని ఫార్మాట్లలో కలిపి 48 సెంచరీలు పూర్తి చేసుకున్న రోహిత్శర్మ.. ప్రస్తుత టీమ్ఇండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
సరసన నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 473-8(గిల్ 110, రోహిత్ 103, బషీర్ 4-170, హార్ట్లే 2-126)