Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ ఆడతాడా..? ఆ మేరకు గ్యారెంటీ ఇస్తేనే తర్వాత జరగాల్సి ఉన్న టీ20 మ్యాచ్లకు ఆడతానని బీసీసీఐతో తేల్చి చెప్పాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆషిష్ షెలార్లతో పాటు ఆలిండియా సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో రోహిత్ ఇదే విషయాన్ని క్లీయర్ గా చెప్పినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. అప్పుడు లండన్లో ఉన్న రోహిత్.. వీడియో కాల్ ద్వారా ఈ మీటింగ్కు హాజరయ్యాడు.
ఢిల్లీ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన సమావేశంలో రోహిత్ సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలతో.. ‘ఒకవేళ మీరు నన్ను వరల్డ్ కప్ సెలక్ట్ చేయాలనుకుంటే ఆ విషయం నాకు ముందే చెప్పండి. ఆ దిశగా నేను కూడా ప్రిపేర్ అవుతాను..’ అని చెప్పినట్టు సమాచారం. దీనిపై సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలు ఏ విధంగా స్పందించారు..? రోహిత్కు ఏ హామీ ఇచ్చారు..? అనేది మాత్రం తెలియరాలేదు.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, అశ్విన్ వంటి సీనియర్లను పొట్టి ఫార్మాట్లో ఆడించలేదు. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్తోనే టీమిండియా సిరీస్లు ఆడుతోంది. ఇటీవలే స్వదేశంలో ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లో కూడా సుమారు ఏడెనిమిది మంది యువ క్రికెటర్లు సత్తా చాటి రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నారు.