హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. ప్రత్యర్థి నెదర్లాండ్స్ ముందు 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఆరుగురు 30కి పైగా స్కోర్ చేశారు. వారిలో ముగ్గురు అర్ధ సెంచరీలు కొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే, విల్ యంగ్లు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే జట్టు స్కోర్ 67 పరుగుల వద్ద కాన్వే (32) వాన్ డెర్ మెర్వ్ బౌలింగ్లో బాస్ డీ లీడెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వన్ డౌన్గా క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర ఓపెనర్ విల్ యంగ్తో కలిసి చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద యంగ్ 70 (7 ఫోర్లు, 2 సిక్సర్లు) వాన్ మీకెరెన్ బౌలింగ్లో బాస్ డీ లేడేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
ఆ తర్వాత 185 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర 51 (3 ఫోర్లు, 1 సిక్సర్) వాన్ డెర్ మెర్వ్ బౌలింగ్లో ఎడ్వర్డ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 32.2 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులకు చేరింది. అనంతరం 238 పరుగుల వద్ద డారిల్ మిచెల్ 48 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) వాన్ మీకెరెన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 247 పరుగుల వద్ద కెప్టెన్ లాథమ్ 53 (6 ఫోర్లు, 1 సిక్సర్) ఆర్యన్ దత్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు.
చివరలో శాంట్నర్ కేవలం 17 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, రెండ్ సిక్సర్లు బాదాడు. దాంతో జట్టు స్కోర్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు చేరింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్, వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. బాస్ డీ లీడె ఒక వికెట్ తీశాడు.