దుబాయ్: క్రికెట్ ప్రేమికులారా మరో ఆసక్తికర పోరుకు సిద్ధం కండి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోమారు కదనరంగంలోకి దూకే సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీలో దాయాది జట్లు ఢీ కొననున్నాయి. అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎమ్సీజీ)లో జరిగే తమ తొలి పోరులో పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. మెగాటోర్నికి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-2లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో పాటు గ్రూపు-‘ఎ’ రన్నరప్, గ్రూపు-‘బి’ విన్నర్ ఉన్నాయి. గ్రూపు-1లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు అఫ్గనిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, గ్రూపు-‘ఎ’ విన్నర్, గ్రూపు-‘బి’ రన్నరప్ పోటీకి దిగనున్నాయి. టీమ్ఇండియా మ్యాచ్ల విషయానికొస్తే..అక్టోబర్ 27న గ్రూపు-‘ఎ’ రన్నరప్తో, అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్తో, నవంబర్ 6న గ్రూపు-‘బి’ విన్నర్తో మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి పోరుతో సూపర్-12 పోరుకు తెరలేవనుంది. అంతకుముందు ఎనిమిది జట్ల మధ్య అర్హత మ్యాచ్లు జరుగుతాయని ఐసీసీ సీఈవో జెఫ్ అల్లార్డిస్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్-2022 భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రపంచకప్ టోర్నీ సెమీస్కు అడిలైడ్ తొలిసారి ఆతిథ్యమిస్తుండగా, నవంబర్ 13న మెల్బోర్న్లో ఫైనల్ జరుగనుంది.