ICC T20 Rankings | భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో కెరియర్లో తొలిసారిగా అత్యుత్తమ స్థానానికి చేరాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ బాదాడు. దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో ఒకేసారి 38 స్థానాలు ఎగబాకి.. రెండో స్థానానికి చేరుకున్నాడు. అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 855 రేటింగ్ పాయింట్లతో టీ20 నెంబర్ బ్యాటర్గా ట్రావిస్ హెడ్ కొనసాగుతుండగా.. అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండోస్థానం, తిలక్ వర్మ 803 రేటింగ్ పాయింట్లతో మూడోస్థానం, ఫిల్సాల్ట్ 798 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 738 రేటింగ్ పాయింట్లతో ఐదో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, బాబర్ అజామ్, పాతుమ్ నిస్సాంక, మహ్మద్ రిజ్వాన్, కుశాల్ పెరెరా ఉన్నారు. అభిషేక్ శర్మ తొలిసారిగా కెరియర్లోనే తొలిసారిగా నెంబర్ 2కి చేరడంతో రెండు నుంచి 9వ ర్యాంక్ వరకు ప్రతి క్రికెటర్ ఒక్కో ర్యాంకులు దిగజారాయి. ఇదిలా ఉండగా.. మరో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మూడో స్థానాలు కోల్పోయి టాప్10 నుంచి దిగజారాడు. ప్రస్తుతం 12వ ర్యాంకులో ఉన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 13 సిక్సర్ల సహాయంతో 135 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా 4-1 తేడాతో ఇంగ్లాండ్పై గెలుపొందింది. ఇక టీ20 బౌలర్స్ ర్యాంకింగ్లో వరుణ్ చక్రవర్తి సైతం ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన విషయం తెలిసిందే. 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే జట్టులోనూ బీసీసీఐ చోటు కల్పించింది.
వరుణ్ మూడు స్థానాలు ఎగబాకి కెరియర్లో అత్యుత్తమంగా రెండోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్కు చెందిన ఆదిల్ రషీద్తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి ఖాతాలో 705 పాయింట్ల చొప్పున ఉన్నాయి. వెస్టిండీస్కు చెందిన అకిల్ హుస్సేన్ 707 రేటింగ్ పాయింట్లతో T20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్నాడు. హసరంగా నాలుగో స్థానంలో, ఆడమ్ జంపా ఐదో స్థానంలో, భారత బౌలర్ రవి బిష్ణోయ్ ఆరో స్థానంలో ఉన్నాడు. టాప్-10లో ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. వరుణ్, బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ ఉన్నారు. అర్ష్దీప్ ఒక స్థానం దిగజారి.. తొమ్మిదో ప్లేస్కి పడిపోయాడు. అక్షర్ పటేల్ 11వ స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో ఉన్న ఆదిల్ రషీద్ రెండవ స్థానానికి పడిపోయాడు. జోఫ్రా ఆర్చర్ నాలుగు స్థానాలు కోల్పోయాడు. ఆరో స్థానం నుంచి 10వ ప్లేస్కు చేరాడు.