Wanindu Hasaranga | గతేడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ మంగళవారమే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్న లంక స్పిన్నర్ వనిందు హసరంగకు ఐసీసీ షాకిచ్చింది. టెస్టులలో తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమైన అతడిని శ్రీలంక జట్టు.. ఈనెల 22 నుంచి బంగ్లాదేశ్తో మొదలుకాబోయే టెస్టు సిరీస్లో సభ్యుడిగా చేర్చింది. తుది జట్టులో కూడా ఉండనుండే ఈ స్పిన్నర్పై ఐసీసీ.. రెండు టెస్టు మ్యాచ్ల నిషేధం విధించడంతో కంగుతినడం అతడి వంతైంది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో అతడి దురుసు ప్రవర్తనే ఇందకు కారణం.
బంగ్లాదేశ్తో ఇటీవలే ముగిసిన మూడో వన్డేలో భాగంగా హసరంగ.. 37వ ఓవర్లో అంపైర్ నుంచి క్యాప్ అందుకునేప్పుడు దురుసుగా ప్రవర్తించాడు. అతడి నుంచి క్యాప్ లాక్కుని అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం హసరంగకు షాక్ తప్పలేదు. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించిన ఐసీసీ.. మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. అంతకుముందే అతడు అఫ్గానిస్తాన్తో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్లో అంపైర్ల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రెండు మ్యాచ్ల నిషేధంతో పాటు ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా ఉన్నాయి.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 7.6 ప్రకారం 8 డీమెరిట్ పాయింట్లు అంటే నాలుగు సస్పెన్షన్ పాయింట్లు. మ్యాచ్ల ప్రకారం చూస్తే టెస్టులు అయితే రెండు మ్యాచ్లు, వన్డేలు, టీ20లు అయితే నాలుగు మ్యాచ్లలో నిషేధం విధించే అవకాశం ఉంది. హసరంగ టెస్టు రీఎంట్రీ ఇవ్వడంతోనే ఐసీసీ అతడిపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది.
కావాలనే చేశాడా..?
హసరంగ టెస్టు రిటైర్మెంట్ బ్యాక్ తీసుకున్న కొద్ది క్షణాలకే ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో అతడు కావాలనే ఇలా చేశాడన్న వాదనలు వినపడుతున్నాయి. లంక ఇప్పట్లో టీ20లు ఆడేది లేదు. ఒకవేళ వైట్ బాల్ క్రికెట్లో నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కోవాలంటే వచ్చే టీ20 వరల్డ్ కప్లో అతడికి షాక్ తప్పేది కాదు. ఇది లంకకు పెద్ద తలనొప్పే. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని ఆ నిషేధాన్ని టెస్టు మ్యాచ్ల మీద తోసేశాడని, హసరంగ ఇది కావాలనే చేశాడని విశ్లేషకులు చెబుతున్నారు.
HASARANGA will retire from Tests after series against Bangladesh 😂#ICC #WaninduHasaranga pic.twitter.com/1wCWc1Hx7F
— Filtercricket (@filter_cricket) March 19, 2024
ఐపీఎల్కు వస్తాడా..?
హసరంగపై నిషేధం పడటంతో ఇకపై అతడు బంగ్లాదేశ్లో లంకతో ఉన్నా దానితో అతడికి గానీ జట్టుకు గానీ ఒనగూరేదేమీ లేదు. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతాడా…? అన్నది ఆసక్తికరంగా మారింది. టెస్టు సిరీస్ కారణంగా అతడు ఏప్రిల్ 4 వరకూ జట్టుతో కలిసే అవకాశం లేని పరిస్థితులు ఉండగా తాజాగా ఐసీసీ నిషేధంతో అతడు తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి…!