చెన్నై : భారత మాజీ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి వైదొలగడానికి గల కారణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు వ్యక్తిగతంగా మరికొన్ని సీజన్లు ఆడాలని ఉన్నా మానసికంగా కుంగిపోయినందుకే ఈ లీగ్ నుంచి తప్పుకున్నానని అతడు తెలిపాడు. ఆదివారం చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తన యూట్యూబ్ చానెల్ ‘ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘గత సీజన్లో సీఎస్కేతో నా ప్రయాణం చాలా నిరాశ కల్గించింది.
వాస్తవానికి నేను మరికొన్ని రోజులు ఈ లీగ్లో కొనసాగాలని భావించా. కానీ మానసికంగా చాలా అలిసిపోయా’ అని తెలిపాడు. అంతేగాక తాను రిటైర్మెంట్ ప్రకటించడంతో చెన్నైకి కూడా రూ. 10 కోట్లు మిగిలాయని, ఆ డబ్బుతో సీఎస్కే వేలంలో జట్టును బలోపేతం చేసుకుంటుందని భావించినట్టు అశ్విన్ చెప్పుకొచ్చాడు.