దుబాయ్: ఈ ఏడాది ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ల ఆటతీరు ఎంత దారుణంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఇద్దరు కీలక ప్లేయర్స్ ప్రదర్శన ప్రభావం ముంబై ఇండియన్స్ టీమ్పైనా పడింది. డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై.. ఇప్పుడు కనీసం ప్లేఆఫ్స్కు వెళ్లడానికి కూడా తంటాలు పడుతోంది. గతేడాది ఐపీఎల్తోపాటు ఆ తర్వాత కూడా సూర్యకుమార్, ఇషాన్ చెలరేగి ఆడుతుండటంతో సెలక్టర్లు వాళ్లను టీ20 వరల్డ్కప్కు కూడా ఎంపిక చేశారు. కానీ తీరా వరల్డ్కప్ సమయానికి ఈ ఇద్దరూ ఫామ్ కోల్పోయారు.
దీనిపై లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. ఇండియన్ టీమ్కు ఎంపికైన తర్వాత ఈ ఇద్దరు ప్లేయర్స్ కాస్త రిలాక్స్ అయినట్లు కనిపిస్తోందని అతడు సెటైర్ వేశాడు. నిజానికి వాళ్లు రిలాక్స్ అయి ఉండకపోవచ్చు. కానీ వాళ్లు ఆడుతున్న కొన్ని షాట్లు చూస్తుంటే.. ఇండియన్ ప్లేయర్స్ కాబట్టి ఇలా పెద్ద షాట్లు ఆడాలి అన్నట్లుగా అనిపిస్తోంది అని సన్నీ అభిప్రాయపడ్డాడు.
కొన్నిసార్లు క్రీజులో సెటిల్ కావడానికి కాస్త సమయం తీసుకోవాలి. ఆ తర్వాత సరైన షాట్ సెలక్షన్ చేసుకోవాలి. ఈ ఇద్దరి విషయంలో ఈసారి ఇది మిస్ అయింది. వాళ్ల షాట్ సెలక్షన్ అస్సలు బాగాలేదు. అందుకే వాళ్లు ఇలా తక్కువ స్కోర్లకే అవుటవుతున్నారు అని గవాస్కర్ అన్నాడు. ఇషాన్ కిషన్ 8 మ్యాచ్లలో కేవలం 107 పరుగులు చేసి తుది జట్టులో స్థానం కోల్పోయాడు. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఏడాది కేవలం 18 సగటుతో 222 పరుగులు చేశాడు.