టోక్యో: జపాన్లో ఫేమస్ ఫుడ్ సుషీ. అక్కడికి వెళ్లిన వాళ్లు ఎవరూ ఈ స్పెషల్ డిష్ను టేస్ట్ చేయకుండా ఉండలేరు. కానీ మన టీమిండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) మాత్రం టోక్యోలో ఇన్ని రోజులు ఉన్నా.. సుషీ జోలికి మాత్రం వెళ్లలేదట. దీని వెనుక కారణాన్ని కూడా అతడు చెప్పాడు. కచ్చితంగా మెడల్ సాధిస్తాడన్న ఆశలతో టోక్యో వెళ్లిన నీరజ్.. అసలు ఈవెంట్కు ముందు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దన్న ఉద్దేశంతోనే సుషీకి దూరంగా ఉన్నట్లు చెప్పాడు. ఎలాంటి చాన్స్ తీసుకోదలచుకోలేదు. అందుకే కొత్త వాటి జోలికి వెళ్లలేదు. ఒకవేళ అది తిన్న తర్వాత నా కడుపులో ఏదైనా తేడా వస్తే? అందుకే నేను నా రెగ్యులర్ డైట్నే ఫాలో అయ్యాను అని నీరజ్ అన్నాడు.
అతడు చాలా వరకూ కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటాడు. అందులో గ్రిల్ చేసిన చికెన్, గుడ్లు, పండ్లు, సలాడ్ వంటివి ఉంటాయి. జపాన్ వెళ్లిన తర్వాత సాల్మన్ చేపలను కూడా ఈ లిస్ట్లో యాడ్ చేసినా.. సుషీకి మాత్రం అతడు దూరంగా ఉన్నాడు. నిజానికి ఈ ఫుడ్ అందరికీ పడుతుందని చెప్పలేము. నీరజ్ చెప్పినట్లు కొందరి కడుపులో ఇది గందరగోళం సృష్టిస్తుంది. ఓ అథ్లెట్గా దేశవిదేశాలు తిరిగే నీరజ్ చోప్రా.. తనకు ఇంటి ఫుడ్ కంటే మించిన టేస్టీ ఫుడ్ మరొకటి ఉండదని చెప్పడం విశేషం.