Ranji Trophy 2024: అంతర్జాతీయ క్రికెట్లో గడిచిన రెండేండ్ల కాలంగా తమదైన దూకుడు ఆటతో టెస్టు క్రికెట్ ఆడే విధానాన్ని మార్చుతున్న ఇంగ్లండ్ టెస్టు జట్టు తమ ఆటతీరుకు పెట్టుకున్న ముద్దుపేరు ‘బజ్బాల్’. ఈ విధానంతోనే స్టోక్స్ సేన స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాటింగ్కు వస్తే ‘బాదుడు’ బౌలింగ్కు వస్తే ‘కూల్చుడు’ విధానంతో సంచలన ఫలితాలు రాబడుతున్నది. తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న రంజీలలో హైదరాబాద్ కూడా అదే బాట పట్టింది. రంజీ మూడో రౌండ్ మ్యాచ్లలో భాగంగా శుక్రవారం సిక్కీంతో మొదలైన మ్యాచ్లో హైదరాబాద్.. సిక్కీంను తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చి 62 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 381 పరుగులు చేసింది.
భాగ్యనగరం వేదిక (నెక్స్ట్జెన్ క్రికెట్ గ్రౌండ్) గా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సిక్కీం.. తొలి ఇన్నింగ్స్లో 27.4 ఓవర్లలో 79 రన్స్కే ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ త్యాగరాజన్ ఆరు వికెట్ల (6/25)తో చెలరేగాడు. మిలింద్.. నాలుగు వికెట్లు (4/30) తీశాడు. సిక్కీం జట్టులో అకుర్ మాలిక్ (17) టాప్ స్కోరర్.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన హైదరాబాద్ దంచికొట్టింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137, 11 ఫోర్లు, 5 సిక్సర్లు), గహ్లోత్ రాహుల్ సింగ్ (64 బంతుల్లో 83, 10 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి వికెట్కు 18 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో హైదరాబాద్ స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. రాహుల్ సింగ్ ఔటైనా వన్ డౌన్లో వచ్చిన రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త నెమ్మదిగా ఆడాడు. తన్మయ్తో కలిసి రోహిత్ రెండో వికెట్కు 138 పరుగులు జోడించాడు. తన్మయ్ నిష్క్రమించాక.. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (66 బంతుల్లో 70, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి 381 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్కు 302 పరుగుల ఆధిక్యం సాధించింది.